పారదర్శకతకు నీరాజనం | Supreme Court Allows Leaked Documents In Rafale Review Petition | Sakshi
Sakshi News home page

పారదర్శకతకు నీరాజనం

Apr 12 2019 1:18 AM | Updated on Apr 12 2019 1:18 AM

Supreme Court Allows Leaked Documents In Rafale Review Petition - Sakshi

అనవసరమైన అంశాల్లో గోప్యత పాటిద్దామని ప్రయత్నిస్తే వికటిస్తుంది. రఫేల్‌ ఒప్పందం పెద్ద కుంభకోణమంటూ ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు పారదర్శకంగా వ్యవహరించి దీటైన జవాబి వ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని అధికార రహస్యాల మాటున, దేశ రక్షణ మాటున దాచడానికి ప్రయత్నించి భంగపడింది. ఈ వ్యవహారంలో లోగడ వెలువరించిన తీర్పును పునస్సమీక్షిం చాలంటూ దాఖలైన పిటిషన్‌కు విచారణార్హత లేదని కేంద్రం చేసిన వాదనను బుధవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అలాగే రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను దొంగిలించి ఆంగ్ల దిన పత్రిక ‘ది హిందూ’ కథనాలు రాసిందని, ఇది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడమే అవు తుంది గనుక వాటిని సాక్ష్యాధారాలుగా పరిగణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చేసిన వాద నను కూడా తిరస్కరించింది.

ఈ తీర్పులో మరో కీలకమైన అంశం– ‘ది హిందూ’ రఫేల్‌ పత్రాలను ప్రచురించడం రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛలో భాగమేనని, దానికి ఆ హక్కు ఉన్న దని తేల్చిచెప్పడం. రఫేల్‌ ఒప్పందంపై సమగ్రమైన దర్యాప్తును కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను నిరుడు డిసెంబర్‌లో సుప్రీంకోర్టు తోసిపుచ్చాక ఆ సమస్య ముగిసినట్టేనని కేంద్రం భావించింది. కానీ ‘ది హిందూ’ ప్రచురించిన మూడు కథనాలతో విషయం మొదటికొచ్చింది. అంతక్రితం ఏం చెప్పినా ఆ కథనాలు వెలువడ్డాకైనా ప్రజలకు వాస్తవాలు వెల్లడించి ఉంటే బాగుండేది. ఆ పత్రిక తప్పుడు కథనాలు ప్రచురించిందని భావిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు అందుకు భిన్నంగా పత్రాలు దొంగిలించారని, ఇది నేరమని వాదించడం అర్ధరహితం. 

రఫేల్‌ ఒప్పందంలో జవాబు చెప్పాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా రఫేల్‌ యుద్ధ విమానాలపై ఏక కాలంలో మన ప్రభుత్వానికి చెందిన రెండు బృందాలు ఫ్రాన్స్‌తో మంతనాలు జరపడంలోని సహేతుకత ఏమిటో వివరించాలి. అలాగే దీనివల్ల మనకు చాలా నష్టం జరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ తరఫున చర్చలు జరిపిన బృందం వ్యక్తం చేసిన అభిప్రాయంలో నిజమెంతో చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఇదేవిధంగా ఒప్పందానికి బ్యాంకు గ్యారెంటీ తీసు కోనట్టయితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఇచ్చిన సల హాకు భిన్నంగా ఎందుకు వ్యవహరించాల్సివచ్చిందో చెప్పాలి. ఫ్రాన్స్‌ ప్రధాని ఇచ్చిన ‘లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌’ సరిపోతుందని ఎలా అనుకున్నారో వివరించాలి. వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వకుండానే సమస్య ముగిసిపోయిందని, సుప్రీంకోర్టు తమకు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని కేంద్రం భావించడం వల్లనే అది మరింత జటిలంగా మారింది.

కొత్త అంశాలు వెల్లడైనప్పుడు ఏ కేసునైనా న్యాయస్థానాలు తిర గదోడతాయి. అలాంటి అవకాశం ఎప్పుడూ ఉంటుందని ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపో యిందో అనూహ్యం. ఒకవేళ దీనిపై పునర్విచారణ అనవసరమనుకుంటే దానికి మద్దతుగా బల మైన వాదనలు వినిపిస్తే వేరుగా ఉండేది. అందుకు భిన్నంగా దొంగిలించారని ఒకసారి... కాదు, వాటి నకళ్లు తీసుకున్నారని మరోసారి వాదించడం ద్వారా ఆ పత్రాల ఆధారంగా వెలువడిన కథ నాల్లో వాస్తవమున్నదని అంగీకరించినట్టయింది. పోనీ అలా అంగీకరించి, ఆ నిర్ణయాలను సహే తుకంగా సమర్ధించుకుంటే ఎవరూ అభ్యంతరపెట్టరు. ఆ జోలికి పోకుండా దొంగిలించిన పత్రాలు గనుక అసలు వాటిని పరిగణనలోకే తీసుకోరాదన్న తర్కానికి దిగింది. దీనికి ధర్మాసనం అంగీ కరించలేదు. 

తాము వెల్లడించదల్చుకోని అంశాలన్నిటినీ గంపగుత్తగా అధికార రహస్యాలుగా పరిగణిం చడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. గోప్యత పేరు చెప్పి ప్రజాప్రయోజనంతో ముడిపడి ఉండే అనేక అంశాలను ప్రభుత్వాలు వెల్లడి కానీయడం లేదు. సమాచారాన్ని తెలుసుకునే హక్కు వాక్‌స్వాతంత్య్రంలో భాగమేనని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో చెప్పింది. కనుక అధి కార రహస్యాల చట్టం కింద కేసులు పెట్టడం వాక్‌ స్వాతంత్య్రాన్ని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే అవుతుంది. మన రాజ్యాంగంలోని 19(2) అధికరణ వాక్‌ స్వాతంత్య్రంపై ఆంక్షలు విధించడానికి సహేతుకమైన కారణాలు చెప్పమంటున్నది. కానీ అధికార రహస్యాల చట్టం దీన్ని విస్మరించింది. ప్రభుత్వాలకు బయటపెట్టడం ఇష్టం లేని ఏ అంశమైనా ఈ చట్టం పరిధిలోకొస్తుంది. వెనువెంటనే దానికింద చర్యలు మొదలవుతాయి. ఒకపక్క ప్రజాస్వామిక దేశమని ఘనంగా ప్రక టించుకుంటూ ఇలా విచక్షణారహితంగా వ్యవహరించే ధోరణి సరికాదు. నిజానికి మన దేశంలో సాగుతున్న స్వాతంత్య్రోద్యమాన్ని అణిచేయడానికి బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన చట్టమిది. 

ఈ సందర్భంగా పెంటగాన్‌ పత్రాల విషయంలో అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయ మూర్తులు ఉదాహరించారు. వియత్నాం యుద్ధంపై ప్రభుత్వం పౌరులకు అసత్యాలు చెబుతున్న దని చెబుతూ అందుకు సాక్ష్యంగా ‘న్యూయార్క్‌టైమ్స్‌’ అధికారిక పత్రాలను ప్రచురించింది. వీటిని అడ్డుకోవడం చెల్లదని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ధర్మాసనంలోని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ కౌల్‌ అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ విడిగా రాసిన తీర్పు పత్రికాస్వేచ్ఛకు నీరాజనాలు పట్టింది. అదే సమయంలో మీడియా నిర్వహిం చాల్సిన, నిర్వహిస్తున్న పాత్రపై నిశితంగా వ్యాఖ్యానించింది.

చలనశీలమైన ప్రజాస్వామ్యం వర్థిల్ల డానికీ, అది బలపడటానికి మీడియా నిర్వహిస్తున్న పాత్రను కొనియాడుతూనే దానిద్వారా ప్రస రించే సమాచారమంతా సత్యనిష్టకు లోబడి ఉండాలి తప్ప ఇతరత్రా అంశాలతో కలుషితం కాకూ డదని తీర్పు హితవు చెప్పింది. అలా కలుషితం కావొద్దని డిమాండ్‌ చేసే హక్కు వినియోగదారు లకు ఉంటుందని కూడా గుర్తుచేసింది. ఈ విషయంలో మీడియా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవ సరం ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఏదేమైనా రఫేల్‌ వివాదం సాధ్యమైనంత త్వరగా ముగిసి మన రక్షణ దళాలు కోరుకున్న యుద్ధ విమానాలు సకాలంలో వారికి చేరుతాయని ఆశిద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement