ప్రాణాంతక వ్యాధులపై జరిగే సమరంలో నిమగ్నమై ఉన్నవారికి ఈ మధ్య చోటుచేసుకున్న రెండు పరిణామాలు ఆసక్తి కలిగిస్తాయి.
ప్రాణాంతక వ్యాధులపై జరిగే సమరంలో నిమగ్నమై ఉన్నవారికి ఈ మధ్య చోటుచేసుకున్న రెండు పరిణామాలు ఆసక్తి కలిగిస్తాయి. ఇందులో ఒకటి మంచి కబురైతే...రెండోది ప్రమాద ఘంటిక మోగించేది. వ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధాలు నిరుపయోగమవుతూ మానవాళి నిస్సహాయతకు చేరువవుతున్న సమయంలో ఒక శక్తిమంతమైన కొత్త యాంటీబయాటిక్ రూపకల్పనకు మార్గం సుగమమైందన్న వార్త సాంత్వన చేకూరుస్తుంది. అదే సమయంలో క్షయవ్యాధి నివారణకు ఉపయోగిస్తున్న రెండో దశ ఔషధాలు కూడా నిరుపయోగమవుతున్న వైనం కనబడుతున్నదని వైద్య నిపుణులు చెబుతున్న సమాచారం ఆందోళన కలిగిస్తుంది. తరతరాలుగా మానవజాతిని పట్టి పీడిస్తున్న... ప్రాణాలు తోడేస్తున్న అంటువ్యాధులపై పోరాడటానికి 1928లో తొలిసారి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తొలి యాంటీబయాటిక్ పెన్సిలిన్ను ఆవిష్కరించారు. అటు తర్వాత ఇలాంటి యాంటీ బయాటిక్స్ దాదాపు వంద వరకూ అందుబాటులోకొచ్చాయి. మనిషి ఆయుః ప్రమాణాన్ని పెంచడంలో వాటి పాత్ర అసామాన్యం. ఏ రోగికి ఏ మోతాదులో ఔషధం ఇవ్వాలన్న విషయంలో విచక్షణ, హేతుబద్ధత కొరవడటంతో రోగకారక క్రిములు బలం పుంజుకోవడం, వాటి నియంత్రణకు రంగంలోకి కొత్త యాంటీ బయాటిక్స్ రావడం చరిత్ర. అయితే ఇదంతా మూడు దశాబ్దాలక్రితం మాట. ఆ తర్వాత శాస్త్రవేత్తలు నిస్సహాయులయ్యారు. కొత్త రకం వ్యాధులకు కొత్త యాంటీ బయాటిక్స్ కనుగొనడం దాదాపు నిలిచిపోయింది. ప్రాణాంతక వ్యాధులకూ, వాటి నియంత్రణకు ఉపయోగిస్తున్న ఔషధాలకూ మధ్య పోరాటం సాగుతుండగా... అందులో క్రమేపీ ఔషధాలు ఓడిపోతున్న ధోరణి కొంతకాలంగా పెరుగుతున్నది. వైద్య నిపుణులకూ, శాస్త్రవేత్తలకూ ఇది ఆందోళన కలిగిస్తోంది. ఇందువల్ల క్షయవ్యాధి వంటి ప్రమాదకర వ్యాధులను లొంగదీయడం అసాధ్యమవుతోంది. ఇప్పటివరకూ ఉపయోగిస్తున్న యాంటీబయాటిక్స్ రోగకారక సూక్ష్మజీవుల ప్రొటీన్లపై దాడిచేసి వాటిని హతమారుస్తున్నాయి. ఈ క్రమంలో ఆ సూక్ష్మజీవులు కొత్త తరహా ప్రొటీన్లను సంతరించుకుని ఆ ఔషధాలను నిరుపయోగం చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త యాంటీబయాటిక్ సూక్ష్మజీవిలోని కణజాలంపై నేరుగా దాడిచేస్తుంది. ఈ ప్రక్రియలో సూక్ష్మజీవి కోలుకోవడానికి, శక్తి సంతరించుకోవడానికి వ్యవధి ఉండదు. అయితే ఈ కొత్త యాంటీబయాటిక్పై మరిన్ని పరిశోధనలు జరిగి ఔషధ రూపంలో ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఇంకా నాలుగైదేళ్లు పట్టవచ్చని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.
మరోపక్క క్షయ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా క్షయ వ్యాధి కారక క్రిమి ఔషధ నిరోధకత(డ్రగ్ రెసిస్టెన్స్)ను సంతరించుకోవడం గమనించి... అలాంటి సందర్భాల్లో రోగులకు ‘మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ (ఎండీఆర్) థెరపీ’ని అందిస్తున్నారు. ఈ థెరపీలో వాడే ఔషధాలు వ్యాధి నివారణకు తోడ్పడని పక్షంలో రోగిపై రెండో దశ ఎండీఆర్ థెరపీ ఉపయోగిస్తారు. అయితే, అది ఇంతకాలమూ అరుదైన సందర్భాల్లో మాత్రమే అవసరమయ్యేది. కానీ, ఇటీవలికాలంలో రెండో దశ ఎండీఆర్ థెరపీ సైతం నిరుపయోగం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 97 లక్షలమంది క్షయబారిన పడుతుండగా మన దేశంలో అలాంటివారి సంఖ్య ఏడాదికి దాదాపు 20 లక్షలుంటున్నది. ఒక క్షయ రోగిని సకాలంలో గుర్తించి చికిత్స అందించి వ్యాధిని నయం చేయకపోతే ఏడాదికి దాదాపు 15మంది కొత్తగా ఆ వ్యాధి బారిన పడతారని ఒక అంచనా. క్షయ వ్యాధివల్ల దేశంలో ఏటా 5 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో 33 శాతంమందికిపైగా జనంలో క్షయ వ్యాధికారక క్రిములుంటున్నాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు. వీరిలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లినప్పుడు వ్యాధికారక బాక్టీరియా విజృంభించి వివిధ భాగాలకు సోకుతుంది. పోలియో వ్యాధి విషయంలో దేశం విజయం సాధించింది. ఇది ఒక వ్యాక్సిన్తో లొంగివస్తుంది. కానీ, క్షయ వ్యాధి నివారణకిచ్చే బీసీజీ వ్యాక్సిన్ ప్రయోజనం కేవలం ప్రాథమిక దశలో మాత్రమే ఉంటుంది. వ్యాధి పెరిగితే దాని తీవ్రతనుబట్టి ఔషధాల వాడకం ఉంటుంది. ఇలాంటి ఔషధాలను రోగి పరిస్థితినిబట్టి ఆర్నెల్లనుంచి రెండేళ్లపాటు క్రమం తప్పకుండా ఉపయోగించాలి. అయితే, సకాలంలో మందుల లభ్యత లేకపోవడంవల్ల కావొచ్చు, నిర్లక్ష్యంవల్ల కావొచ్చు... రోగులు సరిగా వాడకపోతే, అవసరమైన మోతాదు పడకపోతే క్షయ కారక బాక్టీరియా శక్తి పుంజుకుంటుంది. వ్యాపార ప్రయోజనాల కోసం కావొచ్చు, సరైన అవగాహన కొరవడి కావొచ్చు... వైద్యులు అవసరానికి మించి రోగులతో యాంటీబయాటిక్స్ను వాడించడంవల్ల కూడా క్షయ కారక బాక్టీరియా మొండి ఘటంలా తయారవుతున్నదన్నది నిజం. రెండో దశ ఎండీఆర్ థెరపీ కూడా నిరుపయోగం అవుతున్న ఛాయలు కనిపిస్తున్నందున వ్యాధి నివారణకు ఇప్పుడు ఉపయోగించే ప్రామాణిక విధానం కాక విడిగా రోగి స్థితిని అంచనావేసి అవసరమైన మోతాదులో ఔషధాలను వాడించే పద్ధతిని ప్రవేశపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు వ్యాపార ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా, అనవసరంగా ఔషధాలను రుద్దే తీరుపై కూడా పోరాడవలసి ఉంటుంది. ఈ విషయంలో అటు వైద్యులనూ, ఇటు రోగులనూ చైతన్యపరచాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పదిహేనేళ్లక్రితమే ఈ విషయంలో విలువైన సూచనలు చేసింది. వాటిని అనుసరించడంవల్ల పాశ్చాత్య దేశాల్లో యాంటీబయాటిక్స్ వాడకం గణనీయంగా తగ్గింది. మన పాలకులు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. లేనట్టయితే ప్రాణాంతక వ్యాధుల ముందు నిస్సహాయంగా తలవంచే స్థితి ఏర్పడుతుంది.