చంద్రబాబు ఏమైనా మంచి చేశారా? | YS Jagan mohan reddy slams Chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఏమైనా మంచి చేశారా?

Sep 27 2016 5:25 PM | Updated on Aug 1 2018 3:55 PM

చంద్రబాబు ఏమైనా మంచి చేశారా? - Sakshi

చంద్రబాబు ఏమైనా మంచి చేశారా?

ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు హెలికాప్టర్లలో తిరగడమే సరిపోయింది కానీ, వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించే తీరిక లేదని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.

గుంటూరు : ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు హెలికాప్టర్లలో తిరగడమే సరిపోయింది కానీ, వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించే తీరిక లేదని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం గుంటూరు జిల్లా రెడ్డిగూడెంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ వరద ప్రాంత గ్రామాల్లో చంద్రబాబు పర్యటిస్తే ప్రజల ఇబ్బందులు తెలిసేవన్నారు. టీవీల్లో కనిపించడం కోసం చంద్రబాబు హెలికాప్టర్లో తిరిగారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇక గ్రామాల్లో ఒక్క అధికారి కూడా రాలేదని, దమ్మిడి సాయం చేయలేదని అన్నారు. గుంటూరు జిల్లాలో మూడు లక్షల ఎకరాల పత్తి, లక్ష నుంచి రెండు లక్షల ఎకరాల్లో మిరప వేశారని, అందులో ముప్పావు వంతు పంటలు నీట మునిగాయన్నారు. గత సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.

రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మాట తప్పారని, ఇప్పుడు బంగారంపై రుణాలివ్వద్దని చెబుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. బ్యాంకులు రుణాలివ్వక, అప్పులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లనిచ్చిన మామనే కాదని, ఓట్లు వేసిన వారినీ కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించిన తర్వాత కూడా అక్కడ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని, బాధితులకు ఏమాత్రం సాయం అందకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్రంతో పాటు, దేశం మొత్తానికి తెలియచేస్తామని ఆయన అన్నారు. ఇటువంటి సీఎం దేశంలో ఎక్కడా లేరని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement