21వ బ్లాక్ చానల్ వద్ద గొడవపడుతున్న చందలూరు, రుద్రవరం గ్రామస్తులు
తెలుగుగంగ ప్రధాన కాల్వ నీటిని నిలిపి వేయడంతో తుండ్లవాగు రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీటి కోసం పలు గ్రామాల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి.
- రిజర్వాయర్ నీటి కోసం రైతుల మధ్య గొడవలు
రుద్రవరం: తెలుగుగంగ ప్రధాన కాల్వ నీటిని నిలిపి వేయడంతో తుండ్లవాగు రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీటి కోసం పలు గ్రామాల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. రుద్రవరం సమీపంలోని తుండ్లవాగు రిజర్వాయర్ వెనుక వైపు 21, 22 బ్లాక్ చానల్ నుంచి నీరు ప్రవహిస్తోంది. 21వ బ్లాక్ చానల్ పరిధిలో ఆర్ నాగులవరం, తువ్వపల్లె, రెడ్డిపల్లె, నక్కలదిన్నె, కొత్తపల్లె, మందలూరు, చందలూరు తదితర గ్రామాలకు సాగు నీరు అందుతుంది. 22వ బ్లాక్ చానల్స్ పరిధిలో రుద్రవరం టి లింగందిన్నె, తువ్వపల్లె, ఆర్ నాగులవరం, ముత్తలూరు తదితర గ్రామాల భూములకు సాగునీరు అందుతుంది.
తెలుగుగంగ ప్రధాన కాల్వకు 10 రోజులుగా నీరు నిలిపి వేశారు. రుద్రవరం సమీపంలో తుండ్లవాగు రిజర్వాయర్ అరకొరగా నిలిచి ఉన్న నీటి కోసం 21వ బ్లాక్ పరిధిలోని నక్కలదిన్నె, మందలూరు, చందలూరు, రుద్రవరం గ్రామాల రైతులు గొడవలు పడుతూనే ఉన్నారు. వారం రోజుల క్రితం నక్కలదిన్నె గ్రామస్తులు రిజర్వాయర్ నీటిని తరలించేందుకు ప్రయత్నంచగా రుద్రవరం గ్రామస్తులు అడ్డుకున్నారు. మంగళవారం మందలూరు, చందలూరు గ్రామస్తులు బ్లాక్ చానల్ కింద నీటిని విడుదల చేయాలని రుద్రవరం రైతులతో గొడవకు దిగారు.
ఎలాగైనా నీటిని తీసుకెళ్లాలని మూడు గ్రామాల రైతులు అధికారులు, ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్తున్నా రుద్రవరం గ్రామ రైతులు పట్టువదలడం లేదు. రిజర్వాయర్ ప్రాంతంలో కొంత కాలంగా బ్లాక్ వాటర్ను వినియోగించుకొని పంటలు సాగు చేసుకుంటున్నామని కొత్తగా నీటిని విడుదల చేయడం వల్ల ఏటా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి తెలుగుగంగ ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేయించుకొని స్టాక్ చేసుకోగా ఇప్పుడు వచ్చి నీరు కావాలంటే ఎలా అని రుద్రవరం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కాగా బ్లాక్ చానల్ గేటు ఎత్తేందుకు ప్రయత్నించగా రుద్రవరం గ్రామస్తులు అడ్డుకుంటున్నారని మంగళవారం చందలూరు గ్రామస్తులు పోలీసు స్టేషన్ను ఆశ్రయించారు. ఎస్ఐ హనుమంతయ్య ఉన్నతాధికారుల సూచనలతో ఇరువర్గాల రైతులకు నచ్చజెప్పి కొంత మేర నీటిని విడుదల చేయించారు.