వైభవంగా శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం | vijayadurgapeetam anniversary | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం

Aug 16 2017 10:59 PM | Updated on Sep 29 2018 5:55 PM

వైభవంగా శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం - Sakshi

వైభవంగా శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం

వెదురుపాక(రాయవరం): మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠం 45వ వార్షికోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఆగస్టు 16 నుంచి 18 వరకు వార్షికోత్సవాలను నిర్వహించడం రివాజు. వార్షికోత్సవాలను ఉదయం 9.15 గంటలకు

 -విజయదుర్గా పీఠం 45వ వార్షికోత్సవాలు ప్రారంభం
గురుహోరలో రాజమహేంద్రవరం విజయదుర్గా జూనియర్‌ కళాశాల కరస్పాండెంట్‌ పెదపాటి సత్యకనకదుర్గ  జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. పీఠంలో కొలువైన విజయదుర్గా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భద్రాచలం నుంచి వచ్చిన వేదపండితుడు   సీతారామాంజనేయుల ఆధ్వర్యంలో అక్కడి ఆలయంలో మాదిరిగా శ్రీరామ సామ్రాజ్య పాదుకా పట్టాభిషేకాన్ని అర్చకులు వంశీకృష్ణ, సుదర్శనాచార్యులు, సి.మాధవాచార్యులు నిర్వహించారు. పాదుకా సమర్పణ, రాజముద్రిక, రాజదండకం, నందక, ఛత్రచామర, ఆభరణాల సమర్పణ, నదీజలాలు, తీర్థాలు, చతుర సముద్రాధి జలాలతో అభిషేకం, మంగళశాసనం తదితర పూజలను నిర్వహించారు. ఆలయ పురోహితులు శ్రీరామచంద్రుల వారు నాడు ధర్మబద్ధంగా అందించిన పాలనను, సామ్రాజ్య పాదుకా పట్టాభిషేక ఘట్టాలను వివరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. తొలుత స్వామి వారికి కళ్యాణం, అర్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు పీఠంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి పీఠాధిపతి గాడ్‌ ఆశీస్సులు పొందారు. స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ టెంపుల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టరు చిలకపాటి రాఘవాచార్యులు, విశాఖకు చెందిన వ్యాపారవేత్త ద్రోణంరాజు లక్ష్మీనారాయణ, నెల్లూరుకు చెందిన కోట అసోసియేట్స్‌ అధినేత కోట సునీల్‌కుమార్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి రీజనల్‌ కో ఆర్డినేటర్‌ కందర్ప హనుమాన్, వివిధ ప్రాంతాల ప్రముఖులు పూజల్లో పాల్గొన్నారు. పీఠం అడ్మినిస్ట్రేటర్‌ వి.వి.బాపిరాజు, పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్‌(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన  జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement