అమాత్యులపై అసమ్మతి గళం | Unhappy with the accent on pullarao | Sakshi
Sakshi News home page

అమాత్యులపై అసమ్మతి గళం

Dec 5 2015 1:04 AM | Updated on Aug 10 2018 9:42 PM

సర్కారు పనితీరు, అమాత్యుల వ్యవహారశైలిపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. బహిరంగంగానే రాష్ట్ర మంత్రులను టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్: సర్కారు పనితీరు, అమాత్యుల వ్యవహారశైలిపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. బహిరంగంగానే రాష్ట్ర మంత్రులను టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర దాటినా జాబుల్లేవని, ఉపాధికి చేయూతనివ్వడం లేదని అసమ్మతిగళమెత్తుతున్నారు. సొంత పార్టీ నేతల నుంచే ఇలా ప్రతిఘటనలు ఎదురవుతుండటంతో మంత్రులకు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగాలు, పింఛన్లు, ఉపాధి కల్పిస్తామని ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించామని, ప్రస్తుత పరిణామాలు ఆవేదన కల్గిస్తున్నాయని తాజాగా తుళ్లూరు పర్యటకు వెళ్లిన మంత్రి పుల్లారావు ఎదుట సొంత పార్టీ నేతలు ఏకరువుపెట్టారు. భూసమీకరణ పూర్తి చేసిన ఒక్కో గ్రామానికి ప్రభుత్వం నుంచి రూ.30 లక్షలు నజరానా ఇప్పిస్తానని చెప్పిన మంత్రి నారాయణ.. ఇప్పుడు ముఖం చాటేశారని జనచైతన్య యాత్రల్లో పర్యటిస్తున్న ఆయనను కార్యకర్తలు నిలదీస్తున్నారు. మరో మంత్రి రావెల కిశోర్‌బాబును సొంత నియోజకవర్గంలో ఎంపీపీ లక్ష్మీకుమారి బహిరంగంగా విమర్శించడంతో అగ్గిరాజుకుంది.

 పుల్లారావుపై అసంతృప్తి స్వరం
 ‘కాంగ్రెస్ ముఖ్య నేత రామచంద్రయ్య, వామపక్ష నేతల్ని మీటింగ్‌లు పెట్టకుండా అడ్డుకున్నాం.. ఇప్పుడు మాకు జరుగుతున్నదేమిటి? తుళ్లూరు మండలంలో తండ్రి లేని ఓ నిరుద్యోగి ఏడాది కాలంగా మీ సేవ కేంద్రం కోసం కాళ్లరిగేలా తిరిగితే కనీసం మంజూరు చేయించలేకపోయాం.. ఇక మాకు రేపు ప్లాట్లు ఏం ఇస్తారు’ అంటూ ఇటీవల తుళ్లూరు వెళ్లిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అసంతృప్తి సెగ తాకింది. మీ సేవ కేంద్రానికి.. ఫ్లాట్లు కేటాయించడానికి సంబంధం లేదని మంత్రి సమాధానమివ్వగా... ‘మీరు మా నమ్మకం కోల్పోయారని’ తుళ్లూరు టీడీపీ నేతలంతా ఆయనపై ధ్వజమెత్తారు.

 నారాయణకు నిరసనల సెగ..
 జన చైతన్య యాత్రల్లో భాగంగా పర్యటిస్తున్న మంత్రి నారాయణను ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారంటూ టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. నయాపైసా పెట్టుబడి లేకుండా భూములు సమీకరించినప్పుడు హామీలెన్నో ఇచ్చి.. అమలు విషయానికొచ్చే సరికి ఒట్టు తీసి గట్టుమీద పెట్టినట్లు నారాయణ వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇచ్చిన వాగ్దానాలకు ఆయన్ను గుర్రమెక్కించి గ్రామాల్లో ఊరేగించి అభిమానాన్ని చాటుకుంటే.. ఇప్పుడు మొండిచెయ్యి చూపడమేంటని కలత చెందుతున్నారు.

 రావెలపై రాజుకుంటున్న రగడ..
 సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తీరుపై గుంటూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలు తోట లక్ష్మీకుమారి.. బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు. గత నెలలో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో తన భర్తను సమావేశం నుంచి ఉద్దేశపూర్వకంగానే మంత్రి పంపించారనే కోపంతో మంత్రిపై ఆమె తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. తమను తీవ్రంగా అవమానించిన మంత్రి.. జనచైతన్య యాత్రల్లో ఎలా తిరుగుతారో చూస్తామంటూ సవాల్ విసిరారు. తీవ్ర అవమానికి గురైన మంత్రి.. మండలంలో ఎంపీపీ లక్ష్మీకుమారి చెప్పే ఏ పనీ చేయవద్దంటూ అధికారులందరికీ ఆదేశాలిచ్చారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ.. నవంబర్ 24న రాత్రి లాల్‌పురం గ్రామంలోని తన స్వగృహం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. వందల మంది టీడీపీ కార్యకర్తలు మంత్రి రావెలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement