కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం పారదర్శకత, విధివిధానాలు పాటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండ మల్లేశ్ అన్నారు.
-
మాజీ ఎమ్మెల్యే గుండ మల్లేశ్
ఆసిఫాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం పారదర్శకత, విధివిధానాలు పాటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండ మల్లేశ్ అన్నారు. సోమవారం స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ కొత్త జిల్లాలను స్వాగతిస్తున్నామని, జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాల ఏర్పాటులో స్పష్టత లేదని, ప్రజలు కోరుకునే జిల్లాలు ఏర్పాటు చేయాలన్నారు. రెడ్లు, వెలమల స్వార్థం కోసం మంచిర్యాల, నిర్మల్ జిల్లాలుగా ప్రకటించారని విమర్శించారు.
నిర్మల్జిల్లా కావాలని జిల్లా ప్రజలు కోరడం లేదని, వద్దని ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. నైజాం కాలంలో జిల్లా కేంద్రంగా కొనసాగిన ఆసిఫాబాద్ను, బెల్లంపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేసినా, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బెల్లంపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి, ఆసిఫాబాద్లో ఐటీడీఏ పీవో కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ నియోజకవర్గాల్లో జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, సిర్పూర్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఆయన వెంట సీపీఐ నాయకులు పిడుగు శంకర్, జాడి గణేశ్, ఏఐవైఎఫ్ జిల్లా అద్యక్షుడు చిరంజీవి పాల్గొన్నారు.