నిధుల గోల్‌మాల్‌పై కొనసాగుతున్న విచారణ | Tenali Sub-Treasury Office in Investigating officers | Sakshi
Sakshi News home page

నిధుల గోల్‌మాల్‌పై కొనసాగుతున్న విచారణ

Jun 22 2016 1:45 AM | Updated on Sep 4 2017 3:02 AM

నిధుల గోల్‌మాల్‌పై కొనసాగుతున్న విచారణ

నిధుల గోల్‌మాల్‌పై కొనసాగుతున్న విచారణ

తెనాలి సబ్ ట్రెజరీ కార్యాలయంలో నిధులు గోల్‌మాల్ అవడంపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

సబ్‌ట్రెజరీలో రికార్డులు పరిశీలించిన డిప్యూటీ డెరైక్టర్ సురేంద్రబాబు
తెనాలి రూరల్: తెనాలి సబ్ ట్రెజరీ కార్యాలయంలో నిధులు గోల్‌మాల్ అవడంపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కార్యాలయ ఉద్యోగి తాడికొండ వరుణ్‌బాబు ప్రభుత్వోద్యోగుల వేతనాలకు సంబంధించి కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ నుంచి నిధులను అక్రమంగా తన, తన తమ్ముడి ఖాతాల్లోకి మళ్లించి నట్టు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ తతంగానికి సంబంధించి ఖజానాశాఖ అదికారులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదుచేశారు.

దీంతోపాటు శాకాపరమైన విచారణను కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి వరకు రూ. 34 లక్షలు దారిమళ్లినట్టు గుర్తించిన అధికారుల విచారణకు మంగళవారం సాంకేతికపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయి. ఖజానా శాఖకు సంబంధించిన సెంట్రల్ సర్వర్ డౌన్ అవడంతో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల వివరాలను అధికారులు తెలుసుకోలేకపోయారు.

ఖజానా శాఖ డిప్యూటీ డెరైక్టర్ కె.సురేంద్రబాబు తెనాలి సబ్ ట్రెజరీ కార్యాలయానికి వచ్చి రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్నానికి వచ్చిన ఆయన సర్వర్ కనెక్ట్ అవుతుందేమో అని ఎదురుచూశారు. ఫలితం లేకపోవడంతో నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి ఇప్పటివరకు కార్యాలయ అధికారులు, సిబ్బంది విచారణలో తెలిసిన అంశాలు, అందుకు సంబంధించిన ఫైళ్లను తనిఖీచేశారు. సర్వర్ కనెక్ట్ అయితే గాని మరిన్ని వివరాలు తెలియవని, మరో రెండు మూడు రోజులకుగానీ పూర్తి వివరాలు తెలియరావని సురేంద్రబాబు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు వెలుగుచూసిన మొత్తంతోపాటు మరో రూ. 30 నుంచి రూ. 40 లక్షల వరకు అవకతవకలు జరిగి ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు.
 
అధికారులకు తలనొప్పి..
వరుణ్‌బాబు బాగోతం సబ్‌ట్రెజరీ కార్యాలయ ఉ్నతాధికారులకు తలనొప్పిగా మారింది. జూనియర్ అకౌంటెంట్ అయిన వరుణ్‌బాబు సాంకేతికపరంగా తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌లో నిధులను తనకు సంబంధించిన ఖాతాల్లోని మళ్లించాడు. ఈ తతంగమంతా కంప్యూటర్ల ద్వారా జరుగుతుండడంతో అధికారులు గుర్తించలేకపోయారు. భారీ మొత్తంలో నిధులు గోల్‌మాల్ కావడం తెలుసుకుని అవాక్కయ్యారు.

అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కార్యాలయ అధికారులకు తలనొప్పిగా మారింది. అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కె.వెంకటేశ్వర్లు, సబ్ ట్రెజరీ అధికారి టీఏ రాయల్ కార్యాలయ అధికారులుగా ఉన్నారు. తమ కార్యాలయంలో నిధులు గోల్‌మాల్ అవడంపై ఉన్నతాధికారులు వీరిని వివరణ అడిగే ఆస్కారం లేకపోలేదు. అత్యంత గోప్యంగా జరిగిన ఈ వ్యవహారం తమకు తలనొప్పిగా మారిందని, ‘త్వరలో పదవీ విరమణ చేయనుండగా, ఇదేం ఖర్మ’ అంటూ ఓ అధికారి ఆవేదనను వెళ్లగక్కినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement