నకిలీ చలానాలతో పన్ను ఎగ్గొట్టిన రైస్ మిల్లర్ల నుంచి రూ. రూ. 20. 50 కోట్లు రికవరీ
పన్ను ఎగవేత కుంభకోణం కేసు
రైస్ డీలర్లు 50 శాతం చెల్లిస్తేనే వే బిల్లులు ఆన్ చేస్తాం
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్కుమార్
నిజామాబాద్ నాగారం (నిజామాబాద్ అర్బన్) : నకిలీ చలానాలతో పన్ను ఎగ్గొట్టిన రైస్ మిల్లర్ల నుంచి రూ. రూ. 20. 50 కోట్లు రికవరీ అయ్యిందని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని డీలర్ల నుంచి సొమ్మును రికవరీ రెండు రోజులపాటు ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించారు. మంగళవారం జిల్లా డీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సుమారు రూ. 70 పైగా అక్రమాలు జరిగాయన్నారు. రూ. 18. 50 కోట్లు వాణిజ్య పన్నుల శాఖలో, రూ. 2 కోట్లు సివిల్సప్లైలో జరిగిన అక్రమాలకు సంబంధించిన డబ్బును రికవరీ చేసినట్లు తెలిపారు. 117 మంది డీలర్లలో 70 మంది డీలర్ల నుంచి ఈ రీకవరీ చేశామన్నారు. డీలర్ల కొంతమంది రూ. 30 లక్షలు, మరికొందరు రూ. 20 లక్షలు, రూ. 5 లక్షల లోపు పన్నులు కట్టాల్సి ఉందన్నారు. మొత్తం డబ్బును రికవరీ చేస్తామన్నారు. ప్రభుత్వానికి ఎగ్గొట్టిన ప్రతి రూపాయి కక్కాల్సిందే అన్నారు. ఈ విషయంలో సీరియస్గా ఉన్నామన్నారు. అందుకే మా శాఖ నుంచి, సీబీ సీఐడీ విచారణ సైతం జరుగుతోందన్నారు. మార్చి 10 మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.
డీలర్లు మొర పెట్టుకున్నా..
డీలర్లు చెల్లించాల్సిన డబ్బులో 50 శాతం కడితేనే వే బిల్లులు ఓపెన్ చేయిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు అంత పెద్ద మొత్తంలో డబ్బులు కట్టలేమని డీలర్లు మొర పెట్టుకోగా కమిషనర్ పట్టించుకోలేదు. మూడు నాలుగు రోజుల్లో పన్ను కట్టాల్సిందే అన్నారు. ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు కట్టి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని డీలర్లతో పేర్కొన్నారు. 50శాతం కడితేనే వే బిల్లులు ఓపెన్ చేస్తామని, మిగతా డబ్బులకు ఒక నెల రోజుల గడువు ఇస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ కమిషనర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
మోసపోయాం
రైస్మిల్లర్ల సంఘం సంఘం కార్యదర్శి మోహన్రెడ్డి ఆధ్వర్యంలో డీలర్లు కమిషనర్ను కలిసి విన్నవించుకున్నారు. మేము మోసపోయమని, మమ్మల్ని నమ్మించి మోసం చేశారన్నారు. మేము సక్రమంగా పన్నులు చెల్లించామని, మధ్యవర్తిగా ఉండి మమ్మల్ని మోసం చేశారన్నారు. మధ్యవర్తులను నమ్మడం వల్లే ఇది జరిగిందన్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టలేమని, సమయం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో రూ. 1కిలో బియ్యం, గతంలో రూ. 2కిలో బియ్యం తదితర వాటిల్లో మా పాత్ర ఉందన్నారు. ఖచ్చితంగా కట్టుతామని సమయం ఇవ్వాలన్నారు.