మార్గదర్శిని పంపిణీకి చర్యలు
వెంకటగిరి: జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ మార్గదర్శిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. వెంకటగిరిలోని ఆదర్శ పాఠశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 1.34 లక్షలమంది విద్యార్థులకు మార్గదర్శిని ఉపయోగపడుతుందన్నారు. గత ఏడాది జెడ్పీ నిధులు రూ.3కోట్లు వెచ్చించి ప్రభుత్వ వసతిగృహలు, పాఠశాలల భవనాలకు మరమ్మతులు చేయించామన్నారు. ఈ ఏడాది నిధుల లేమితో నిధులు కేటాయించలేదన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం తమిళనాడు తరహాలో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సును ప్రవేశపెట్టాలని కోరారు. మోడల్ స్కూల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్పాఠశాల ప్రిన్సిపల్ అపర్ణ, వైఎస్సార్సీపీ నేత గూడూరు భాస్కర్రెడ్డి, పద్మశాలీయుల సాధికార సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు, పెంచలకోన ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు ఢిల్లీబాబు, మాజీ ఎంపీపీ తాండవ రాజారెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటరత్నం రాజు, తోట గిరిరెడ్డి, వెంగమాంబపురం సింగిల్విండో ఉపాధ్యక్షుడు రావెళ్ల వెంకటకృష్ణమనాయుడు ఉన్నారు.
సంబంధిత వార్తలు