
హాస్టల్ ఉద్యోగిని హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు
వైఎస్సార్ జిల్లా ముద్దనూరు ఎస్సీ బాలికల వసతి గృహంలో కమాటిగా విధులు నిర్వహిస్తున్న మిద్దె నాగలక్షుమ్మ అనే ఉద్యోగిని హత్య కేసులో ఏడుగురికి ....
ముద్దనూరు: వైఎస్సార్ జిల్లా ముద్దనూరు ఎస్సీ బాలికల వసతి గృహంలో కమాటిగా విధులు నిర్వహిస్తున్న మిద్దె నాగలక్షుమ్మ అనే ఉద్యోగిని హత్య కేసులో ఏడుగురికి కడప 4వ ఏడీజే న్యాయస్థానం సోమవారం జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.3వేల జరిమానా విధించినట్లు ఎస్ఐ నరసింహారెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు పెద్దముడియం గ్రామానికి చెందిన నాగలక్షుమ్మ ముద్దనూరు హాస్టల్లో విధులు నిర్విహ ంచేవారు. 2014 మార్చి 4వతేదీన ఉదయం ఇంటి వద్ద నుంచి హాస్టల్కు వెళ్తుండగా చెన్నారెడ్డిపల్లె రహదారిలో ఆమెను దారుణంగా హత్య చేశారు. మైదుకూరు హాస్టల్లో పని చేస్తున్న ఉమ్మడిగుర్రమ్మ అనే మహిళతో నాగలక్షుమ్మకు మధ్య డబ్బు విషయమై గొడవ జరిగింది.
ఈ నేపథ్యంలో నాగలక్షుమ్మను హత్య చేసినట్లు అప్పట్లో పోలీసులు వెల్లడించారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులైన గూడెంచెరువు గ్రామానికి చెందిన కొట్టం గంగయ్య, ప్రొద్దుటూరు మండల మీనాపురానికి చెందిన గిడ్డంగి గౌస్, మైలవరం మండలం దొమ్మరనంద్యాలకు చెందిన పట్నం సలీం, జమ్మలమడుగుకు చెందిన జిల్లెల దస్తగిరి, కన్నెలూరుకు చెందిన బత్తల దినేష్, గూడెంచెరువుకు చెందిన పూజారి సురేంద్రారెడ్డి, మైదుకూరు హాస్టల్లో పనిచేస్తున్న అంబవరం గ్రామానికి చెందిన ఉమ్మడి గుర్రమ్మలకు జీవిత ఖైదు విధించినట్లు ఎస్ఐ తెలిపారు.