మరణంలోనూ వీడని స్నేహం | road accident.. senior citizens death | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని స్నేహం

Sep 1 2016 8:15 PM | Updated on Aug 30 2018 4:07 PM

ప్రమాదస్థలి వద్ద మృతదేహాలు - Sakshi

ప్రమాదస్థలి వద్ద మృతదేహాలు

ఇంటి పెద్దలు కష్టపడితేనే కుటుంబాలు గడువని దుస్థితి.. వృద్ధాప్యం మీదపడ్డా వ్యవసాయం చేసుకుంటూ నెట్టుకొస్తున్న ఇద్దరు రైతులు గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

  • రోడ్డు ప్రమాదంలో వృద్ధ రైతుల దుర్మరణం
  • పొలాలకు వెళుతుండగా ఎదురొచ్చిన మృత్యువు
  • రామాయంపేటలో విషాదం
  • రామాయంపేట: రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు వారివి.. ఇంటి పెద్దలు కష్టపడితేనే కుటుంబాలు గడువని దుస్థితి.. వృద్ధాప్యం మీదపడ్డా వ్యవసాయం చేసుకుంటూ గుట్టుగా సంసారాలను నెట్టుకొస్తున్న ఇద్దరు రైతులు గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థానికులను కలిచివేసింది. బతికున్నపుడు కలిసిమెలిసి ఉన్న స్నేహితులిద్దరూ మరణంలోనూ వీడలేదు.

    వివరాల్లోకి వెళితే... రామాయంపేటలోని హరిజనవాడలో నివాసం ఉంటున్న బైరం లస్మయ్య(55), గావు లింగం (60) ఇరుగు పొరుగున ఉంటారు. వారు కాలనీలో అందరితో కలిసిమెలిసి ఉంటారు. వారిద్దరు  వ్యవసాయ పనులకు వెళ్లినా కలిసే వెళుతారు. ఈ క్రమంలో  సాయంత్రం వారిద్దరు ఒకే సైకిల్‌పై తమ పొలాల వద్దకు వెళుతున్నారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వెళుతుండగా, ఎదురుగా కంకరలోడుతో వస్తున్న లారీ దూసుకొచ్చింది.

    ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వీరిని చికిత్స నిమిత్తం  హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంతో సైకిల్‌ దెబ్బతిన్నది. లస్మయ్యకు భార్య ఆండాలుతోపాటు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. గావు లిం‍గానికి భార్య శాంతవ్వతోపాటు కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ ఘటనతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక ఎస్‌ఐ ప్రకాశ్‌గౌడ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement