ఆలయంలో ఘనంగా సుదర్శన యాగం
యాదగిరికొండ : యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి దేవస్థానంలో ఆదివారం ఆలయంలో సుదర్శన యాగాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.
యాదగిరికొండ : యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి దేవస్థానంలో ఆదివారం ఆలయంలో సుదర్శన యాగాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వయంభూమూర్తులకు పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలను ధరింపచేశారు. వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకారం చేశారు. ఆలయంలో ప్రత్యేక పీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అదిష్ఠింప చేసి వివిధ రకాలైన పుష్పాలు, తులసీ దళాలతో అర్చన గావించారు. అలాగే ఆలయంలో సుదర్శన యాగాన్ని నిర్వహించారు. నవగ్రహాలకు ప్రదక్షిణం గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగళ్ లక్షీనరసింహచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు గట్టు యాదగిరిస్వామి, మంగళగిరి నరసింహమూర్తి, ఆలయ అధికారులు చంద్రశేఖర్, జూషెట్టి కృష్ణ, వేముల వెంకటేశ్, రాకేశ్ బాబు పాల్గొన్నారు.