యువకుడి మృతిపై ఆర్డీఓ విచారణ | rdo enquiry on ramesh dies | Sakshi
Sakshi News home page

యువకుడి మృతిపై ఆర్డీఓ విచారణ

Jun 27 2017 10:35 PM | Updated on Sep 5 2017 2:36 PM

యువకుడి మృతిపై ఆర్డీఓ విచారణ

యువకుడి మృతిపై ఆర్డీఓ విచారణ

లేపాక్షి మండలం పులమతికి చెందిన రమేష్‌ మృతిపై ఇన్‌చార్జ్‌ ఆర్డీఓ విశ్వనాథ్‌ మంగళవారం విచారణ చేశారు.

హిందూపురం అర్బన్‌ : లేపాక్షి మండలం పులమతికి చెందిన రమేష్‌ మృతిపై ఇన్‌చార్జ్‌ ఆర్డీఓ విశ్వనాథ్‌ మంగళవారం విచారణ చేశారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని ఎస్‌ఐ శ్రీధర్‌, సిబ్బంది పట్టుకొచ్చి లాఠీలతో చితకబాదడంతో దెబ్బలకు తాళలేక రమేష్‌ సోమవారం రాత్రి మృతి చెందాడు. పోలీసులే కొట్టి చంపారంటూ బంధువులు ఆరోపించారు. ఆ రోజు రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు హిందూపురం ఆస్పత్రి ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. మృతదేహంతో ఆందోళన చేపట్టాలని బంధువులు, గ్రామస్తులు ప్రయత్నించారు. అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు.. వారిని పోస్టుమార్టం గది వైపు పోకుండా నియంత్రించారు. భారీ బందోబస్తు మధ్య శవ పరీక్షలు నిర్వహించారు.

తమకు న్యాయం జరగకుంటే శవాన్ని తీసుకెళ్లేది లేదంటూ బాధితులు భీష్మించారు. ఇంతలో ఇన్‌చార్జ్‌ ఆర్డీఓ విశ్వనాథ్‌ అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. బాధితులందరినీ తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు పిలిపించి మృతుడి భార్య పుష్ప, ఆమె తండ్రిని విచారణ చేసి, వాంగ్మూలం నమోదు చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన ఇతర వ్యక్తులను కూడా ఆర్డీఓ విచారణ చేశారు. చివరకు చంద్రన్న బీమా పథకం ద్వారా రూ.4 లక్షల పరిహారం అందించేలా కృషిచేయడంతో పాటు నష్టపరిహారం కింద రూ.లక్ష ఇచ్చేలా హామీ చెప్పినట్లు తెలిసింది. అనంతరం భారీ బందోబస్తు మధ్య శవాన్ని పులమతి గ్రామానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement