ప్రేమ మైకంలో ఖాకీ కాఠిన్యం
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం) : వివాహేతర సంబంధం నెరపుతూ భార్యను వదిలించుకోవాలనే ఆలోచనతో ఆమెపై ఓ కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన నగరంలో సంచలనమైంది. కానిస్టేబుల్ చేతిలో చావుదెబ్బలుతిన్న బాధితురాలి కథనం ప్రకారం రాజమహేం
ప్రియురాలి మోజులో భార్యపై కానిస్టేబుల్ దాడి
మూడేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా కేసు పెట్టలేదు..
ఎస్పీకి ఫిర్యాదు చేసినందుకు చావబాదాడు..
ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితురాలు
న్యాయం చేయాలని వేడుకోలు
వివాహేతర సంబంధం నెరపుతూ భార్య పై దాడి చేసిన కానిస్టేబుల్
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం) : వివాహేతర సంబంధం నెరపుతూ భార్యను వదిలించుకోవాలనే ఆలోచనతో ఆమెపై ఓ కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన నగరంలో సంచలనమైంది. కానిస్టేబుల్ చేతిలో చావుదెబ్బలుతిన్న బాధితురాలి కథనం ప్రకారం రాజమహేంద్రవరం వన్టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న నరసయ్య 2002లో రాజమహేంద్రవరం, ఆర్యాపురం, మూలగొయ్యి ప్రాంతానికి చెందిన సంగీత అనే మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. వివాహ సమయంలో నరసయ్య పాల వ్యాపారం చేసేవాడు. అనంతరం కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. మొదట త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే సమయంలో ఎక్సైజ్ కానిస్టేబుల్గా పని చేసే ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో అసలు భార్యను వదిలించుకుని ఆమెతో జీవించేందుకు సిద్ధమయ్యాడు. దీనిపై మూడేళ్లుగా సంగీత త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొంది. నాలుగు రోజుల క్రితం సంగీత రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజ కుమారిని కలసి తన గోడు వెళ్లబొసుకున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న నరసయ్య మంగళవారం రాత్రి మూలగొయ్యిలో ఉంటున్న సంగీత ఇంట్లోకి వెళ్లి చావబాదాడు. అపస్మారక స్థితిలో ఉన్న సంగీతను ఆమె సోదరులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
భార్యను వదలించుకునేందుకు చిత్రహింసలు
మరో మహిళా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న నరసయ్య తనను వదిలించుకునేందుకు అనేక సార్లు చిత్రహింసలకు గురి చేశాడని, తనను వదిలేస్తే కొంత సొమ్ము ఇస్తానని బెదిరించేవాడని బాధితురాలు తెలిపింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సైతం నీ భర్తను వదిలేస్తే నేను కూడా కొంత సొమ్ము ఇస్తానని నాపై వత్తిడి తెచ్చేవారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు చేయలేదని ఇప్పటికైనా తనకు, తన బిడ్డలకు న్యాయం చేయాలని వేడుకున్నారు.