ఓవర్టేక్ చేయబోయిన ఆటో బోల్తాపడటంతో ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
ఆటో బోల్తా.. ఒకరి మృతి
మరో ఏడుగురికి గాయాలు
బత్తలపల్లి : ఓవర్టేక్ చేయబోయిన ఆటో బోల్తాపడటంతో ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముదిగుబ్బ మండలం చిన్నకోట్లకు చెందిన ఎనిమిది మంది దేవాలయం వద్దకు సిమెంట్ రేకులు తీసుకురావడానికి ఆటోలో అనంతపురం బయల్దేరారు. బత్తలపల్లి దాటి కొంత దూరం వెళ్లగానే ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోతుండగా ఎదురుగా మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేక్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అందరూ గాయపడ్డారు.
వెంటనే అదే ఆటోను పైకిలేపి అనంతపురం ఆస్పత్రికి వెళుతుండగా మార్గంమధ్యలోనే సూర్యనారాయణరెడ్డి (53) మృతి చెందాడు. మరో ఆరుగురు నారాయణప్ప, ఉదయ్కుమార్రెడ్డి, చంద్ర, గిట్టా నారాయణ, నాగభూషణ, క్రిష్టలు గాయపడ్డారు. సూర్యనారాయణరెడ్డికి భార్య సుధామణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆటో డ్రైవర్ బ్రహ్మా సురక్షితంగా బయటపడ్డారు.
ట్రాక్టర్, లారీ ఢీ.. ముగ్గురికి గాయాలు
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలో లారీ ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టడంతో గ్రాసం లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో మడ్డిపల్లికి చెందిన వెంకటేశ్వరరెడ్డి (51), వెంకటరామిరెడ్డి (58), వెంకటటేశ్వరెడ్డి (53)లు గాయపడ్డారు. కర్నూలు జిల్లా అవుకు నుంచి గ్రాసం తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.