ఫీజుల ఖరారుకు త్వరలో నోటిఫికేషన్ | Notification of fees to be finalized soon | Sakshi
Sakshi News home page

ఫీజుల ఖరారుకు త్వరలో నోటిఫికేషన్

Oct 27 2015 5:05 AM | Updated on Oct 2 2018 7:58 PM

రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి (2016-17) వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు కోసం త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది

♦ వృత్తి విద్యా కళాశాలల్లో వచ్చే ఏడాది నుంచి వసూలుకు ఏర్పాట్లు
♦ ఒకట్రెండు రోజుల్లో అధికారిక నిర్ణయం
♦ సీఎం వద్ద ఏఎఫ్‌ఆర్‌సీ సభ్యుల నియామకం ఫైలు
♦ {పస్తుత కమిటీ నేతృత్వంలోనే నోటిఫికేషన్!
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి (2016-17) వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు కోసం త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. ప్రభుత్వం రెండు నెలల క్రితం జస్టిస్ స్వరూప్‌రెడ్డి చైర్మన్‌గా ప్రత్యేక ఫీజులు, నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ శాఖల అధికారులతో పాటు ఇంజనీరింగ్, వైద్య తదితర విద్యా విభాగాలకు చెందిన అధికారులు, కాలేజీ ప్రతినిధులు, యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. జస్టిస్ స్వరూప్‌రెడ్డి కమిటీ సభ్యుల కోసం ఒక్కో కేటగిరీలో ముగ్గురి పేర్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపించారు. ఒక్కో కేటగిరిలో ఒక్కొక్కరి పేరును కమిటీ సభ్యులుగా ప్రభుత్వం ఖరారు చేసింది.

అయితే, ఆ ఫైలు ప్రస్తుతం కేసీఆర్ వద్ద పెండింగ్‌లో ఉండడంతో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడేసరికి ఆలసమయ్యే అవకాశం ఉంది. అయితే వచ్చే విద్యాసంవత్సరానికి 8 నెలల సమయం మాత్రమే ఉండడంతో కాలేజీ వారీగా, కోర్సు వారీగా ఫీజులను ఖరారు చేయడం కష్టమవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న కమిటీ నేతృత్వంలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 ఏడాదికేనా? మూడేళ్లకా!
 ఉమ్మడి రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల ఖరారు కోసం 2012లో ప్రభుత్వం ఏఎఫ్‌ఆర్‌సీని ఏర్పాటు చేసింది. కాలేజీ ఆదాయ వ్యయాలను బట్టి 2013-14, 2014-15, 2015-16 విద్యా సంవత్సరాల్లో ఆయా కాలేజీలు వసూలు చేయాల్సిన ఫీజులను కమిటీ ఖరారు చేసింది. ఆ గడువు ఈ విద్యా సంవత్సరంతో ముగుస్తోంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి వసూలు చేసే ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే, ఒక్క విద్యా సంవత్సరం కోసమే ఫీజులను ఖరారు చేస్తారా? వచ్చే మూడేళ్ల కోసం ఖరారు చేస్తారా? అన్న విషయాన్ని నోటిఫికేషన్‌లోనే స్పష్టం చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement