నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.
నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయని నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ ఎ.వై.రెడ్డి చెప్పారు. గుంటూరులోని ఓ హోటల్లో శుక్రవారం ఏపీ, తెలంగాణ, యానాం, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లోని నవోదయ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, విద్యాశాఖాధికారులతో ప్రవేశాల ప్రక్రియపై సమావేశాన్ని నిర్వహించారు. ఎ.వై.రెడ్డి మాట్లాడుతూ నూతన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన జరగనున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల పరిశీలన క్షుణ్ణంగా జరిపి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక జరగాల్సి ఉందని స్పష్టం చేశారు. గతేడాది ప్లస్ టూ ఫలితాల్లో 99.44 శాతం ఉత్తీర్ణత నమోదుచేసి హైదరాబాద్ రీజియన్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. సమావేశంలో నవోదయ నేతృత్వ సంస్థ డెరైక్టర్ జంధ్యాల వెంకటరమణ, అసిస్టెంట్ కమిషనర్లు జి.అనసూయ, వి.జె.జగదీశ్వరాచారి పాల్గొన్నారు.