
డిజిటల్ విధానంతో కొత్త వెలుగులు
డిజిటల్ విద్యా విధానంతో విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.
• అందరూ సద్వినియోగం చేసుకోవాలి
• రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
డిజిటల్ విద్యా విధానంతో విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ తోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ, సూర్యాపేట పట్టణం, గాజుల మల్కాపురం ఉన్నత పాఠశాలల్లో బుధవారం ఆయన డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండలో మొత్తం 191 పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించామన్నారు. త్వరలో మిగతా అన్ని పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతులు ప్రారంభిస్తామన్నారు.
నకిరేకల్ : డిజిటల్ విద్యా విధానం ద్వారా విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ జెడ్పీ పాఠశాలల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ విద్యా తరగతులను నకిరేకల్లోని జెడ్పీహైస్కూల్లో బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిటల్ తరగతులపై పదవ తరగతి విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. ఈ డిజిటల్ తరగతుల ఉపయోగం ఏమిటి అని విద్యార్థులను అడిగారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో వస్తున్న శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్ధులకు ఉపయోగించాలనే ఆలోచనలతో ముఖ్యమంత్రి కేసీఆర్ డిజిటల్ విద్యా తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు.
నల్లగొండ జిల్లాలో మొత్తం 191 పాఠశాలల్లో ఈ డిజిటల్ తరగతులను ప్రారంభించామన్నారు. త్వరలోనే మిగితా పాఠశాలలో కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ డిజిటల్ తరగతులపై 1400మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వీరు విద్యా పాఠ్యాంశాలను ఎలా బోధించాలన్న విషయాలను ఈ తరగతుల ద్వారా వెల్లడిస్తారన్నారు. విద్యార్థులకు ఈ డిజిటల్ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చదువు అనేది కేవలం ఉద్యోగాల కోసం, పరీక్షల మార్కుల కోసం కాకుండా జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ నోట్లకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక విశ్లేషకులతో చర్చిస్తున్నారని.. త్వరలోనే తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారని తెలిపారు. ఐదారు సంవత్సరాలుగా నల్లధనానికి సంబంధించిన చర్చ జరుగుతోందన్నారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందు నల్లధనాన్ని బయటకు తీసుకురావడం కోసం కొన్ని పార్టీలు హామీలు ఇచ్చాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, అటవీశాఖ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల వీరందర్, ఏజేసీ వెంకట్రావు, ఆర్డీఓ వెంకటాచారి, డీఈఓ చంద్రమోహన్, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మొగిలి సుజాతయాదయ్య, జె డ్పీటీసీ పెండెం ధనలక్ష్మి సదానందం, నార్కట్పల్లి ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, ఎంపీటీసీలు ఎల్లపురెడ్డి సైదారెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్, తండు మమత, బచ్చుపల్లి పద్మ రవీందర్రావు తదితరులు ఉన్నారు.
డిజిటల్ తరగతులతో విద్యార్థులకు ఎంతో మేలు : జేసీ
నల్లగొండ టూటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టిన డిజిటల్ తరగతులతో విద్యార్థులకు ఎంతో మేలు కలగనుందని జేసీ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో మాధవనగ ర్లో గల జేబీఎస్ స్కూల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. దృశ్యరూపం ద్వారా విద్యాబోధనతో విద్యార్థులకు సులభంగా అర్థం అవుతదన్నారు. అనంతరం విద్యార్థులకు నల్లధనం వల్ల దేశానికి నష్టంపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారెడ్డి అంజిరెడ్డి, ఉపాధ్యాయులు శంకర్, కేసాని వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బియ్యం మార్పిస్తాం..
డిజిటల్ తరగతులు ప్రారంభించడానికి జేబీఎస్ స్కూల్కు వచ్చిన జేసీ నారాయణరెడ్డి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలకు వచ్చే బియ్యం నల్లగా ఉండడంతో పాటు దుమ్ము ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు వివరించారు. బియ్యం వెంటనే మార్పిస్తానని జేసీ హామీ ఇచ్చారు.