డబ్బు, ఆస్తి కోసమే హత్య


కామారెడ్డి క్రై ం : డబ్బు, ఆస్తి కోసమే కుటుంబ పెద్దను హత్య చేసినట్టు తేలింది. భార్య, కొడుకు, అల్లుడే హతమార్చినట్టు పోలీసులు తేల్చారు. పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌రావ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి . పట్టణంలోని బతుకమ్మకుంట కాలనీకి చెందిన అల్లకుంట సిద్దయ్య(55), అతడి భార్య పోచవ్వ కలిసి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కూలి డబ్బులు ఒకేసారి రూ.10 వేలు వచ్చాయి . డబ్బు మొత్తం సిద్దయ్య తన వద్దే ఉంచుకుని జులాయి గా తిరుగుతున్నాడని పోచవ్వ, ఆస్తి పంచి ఇవ్వడం లేదని కొడుకు శివయ్య తరచుగా గొడవ పడుతుండేవారు.

 

  శనివారం రాత్రి ఇంటి దగ్గర సిద్దయ్యతో ఆయన భార్య పోచవ్వ, కొడుకు శివయ్య గొడవపడి చితకబాదారు. ఇంట్లోకి వెళ్లాక తలుపు వేసి కొడుకు, అల్లుడు సంతోష్‌తో కలిసి భార్య పోచవ్వ సిద్దయ్య తలపై రోకలిబండతో మోది హతమార్చారు. ఆదివారం ఉదయాన్నే కాలనీవాసులకు సిద్దయ్య అతిగా మద్యం సేవించి మురికి కాలువలో పడి చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరపగా నేరం అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్టు ఎస్‌హెచ్‌వో తెలిపారు. మృతుడి సోదరి వజ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సమావేశంలో ఎస్‌సై శోభన్‌బాబు, సిబ్బంది ఉన్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top