వివాహిత ఆత్మహత్య | married woman commit to suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Sep 4 2017 1:20 PM | Updated on Nov 6 2018 8:08 PM

వివాహిత ఆత్మహత్య - Sakshi

వివాహిత ఆత్మహత్య

చాకిపల్లి కొత్తూరు గ్రామంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లో ఉరివేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడింది.

కడుపునొప్పి తాళలేక అఘాయిత్యం

టెక్కలి రూరల్‌: చాకిపల్లి కొత్తూరు గ్రామంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లో ఉరివేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామానికి చెందిన ధనలక్ష్మి(19)కి చాకిపల్లి కొత్తూరు గ్రామానికి చెందిన ఏదూరి గణపతితో గత ఏడాది మార్చి 25వ తేదీన వివాహం జరిగింది. గణపతి స్థానికంగా తాపీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగానే శనివారం రాత్రి భార్యాభర్తలు తమ ఇంట్లో నిద్రించారు. ఆదివారం ఉదయం లేచి చూసే సరికి తన ఇంటి దూలానికి ధనలక్ష్మి వేలాడుతూ కనిపించడంతో భర్త అతాశుడయ్యాడు.

వెంటనే మృతురాలి తల్లిదండ్రులకు, బంధువులకు సమాచారం అందించాడు. జర్జంగి గ్రామం నుంచి మృతురాలి తల్లిదండ్రులు వచ్చి కుమార్తె మృతదేహంపై పడి బోరున విలపించారు. గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి జీరు పున్నయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశాడు. గత కొద్ది కాలంగా ధనలక్ష్మి కడుపునొప్పితో బాధపడుతుండేదని, నాటువైద్యం చేయించిన ఫలితం లేకపోవడంతో బాధను భరించలేక తన కుమార్తె ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఆ ఫిర్యాదులో పేరొన్నాడు. పోలీసులు మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు టెక్కలి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  

కడుపునొప్పి తాళలేక...
కవిటి: శావసానపుట్టుగకు చెందిన అవివాహిత నర్తు కృష్ణ(25), అలియాస్‌ కృష్ణమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కవిటి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గత కొన్నేళ్లుగా కడుపునొప్పి సమస్యతో కృష్ణ వైద్యం చేయించుకొంటుంది. మందులు వాడుతున్నప్పటికీ నయంకాలేదు. శనివారం సాయంత్రం మళ్లీ కడుపునొప్పి అధికంగా రావడంతో గ్రామంలోనే గుళికలు మింగేసింది.ఇంటిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. శనివారం అర్ధరాత్రి ఆస్పత్రిలో ఆమె మృతి చెందింది. మృతురాలి సోదరి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవిటి ఎస్‌ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement