
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బద్వేలు పట్టణంలోని కొండారెడ్డి వీధిలో నివసించే గోవుల అమరావతి(32) అనే వివాహిత గురువారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
– భర్త, అత్త, ఆడబిడ్డే హత్య చేశారని బంధువుల ఆరోపణ
బద్వేలు అర్బన్: బద్వేలు పట్టణంలోని కొండారెడ్డి వీధిలో నివసించే గోవుల అమరావతి(32) అనే వివాహిత గురువారం తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే భర్త వెంకటయ్య మాత్రం తన భార్యకు మానసికస్థితి సరిగా లేకపోవడంతో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలుపుతుండగా మృతురాలి తల్లి, అక్కలు మాత్రం భర్త, అత్త, ఆడబిడ్డలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బద్వేలు మండలం అబ్బూసాహెబ్ పేట గ్రామానికి చెందిన జి. వెంకటయ్యకు 14 ఏళ్ల క్రితం చాపాడు మండలం కుచ్చుపాప గ్రామానికి చెందిన పిచ్చయ్య, వెంకటలక్షుమ్మల కుమార్తె అయిన అమరావతితో వివాహమైంది. వీరికి వెంకటహేమంత్(11), వెంకట అశ్వంత్(9) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటయ్య మున్సిపాలిటీ పరిధిలోని భాకరాపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో సుమారు 6 ఏళ్ల క్రితం పట్టణంలో చేరి ఇటీవలే కొండారెడ్డి వీధిలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. వెంకటయ్య రోజు మాదిరిగానే పిల్లలను బడిలో వదిలి తానుకూడా బడికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో భోజనానికి ఇంటికి వచ్చిన పిల్లలు లోపలికి వెళ్లే సరికి అమ్మ ఫ్యాన్కు ఉన్న ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో చుట్టు పక్కల వారికి తెలిపారు. వెంటనే వారు మృతురాలి భర్తకు సమాచారం ఇవ్వగా ఆయన తన అత్తింటి వారికి సమాచారం చేరవేశారు. వారు వచ్చేసరికి ఆమె మృతదేహం మంచంపై ఉండడంతో వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను ఆడబిడ్డ, భర్త, అత్తలు తరచూ వేధిస్తుండేవారని తమ కుమార్తెను వారే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వాపోయారు. అయితే కొంతమంది పెద్ద మనుషులు కేసులెందుకని మృతదేహాన్ని మృతురాలి భర్త సొంత గ్రామమైన అబ్బూసాహెబ్ పేటకు తరలిస్తుండగా విషయం తెలుసుకున్న సీఐ మృతదేహాన్ని వెనక్కు రప్పించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పోలీసుల ఎదుట తమ కుమార్తెకు అనారోగ్యంగా ఉండేదని , అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెప్పిన మృతురాలి తల్లిదండ్రులు మీడియా ముందు మాత్రం తమ కుమార్తెను భర్త, అత్త, ఆడబిడ్డలు హత్యచేశారని చెప్పడం గమనార్హం. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.