సిమ్‌కార్డు ఇస్తే.. ప్రాణం తీశారు! | life spoil of sim card issue | Sakshi
Sakshi News home page

సిమ్‌కార్డు ఇస్తే.. ప్రాణం తీశారు!

May 7 2017 11:18 PM | Updated on Sep 5 2017 10:38 AM

సిమ్‌కార్డు ఇస్తే.. ప్రాణం తీశారు!

సిమ్‌కార్డు ఇస్తే.. ప్రాణం తీశారు!

సిమ్‌కార్డు.. ఓ నిండు ప్రాణాన్ని బలికోరింది. మిత్రుడే కదా అని సిమ్‌కార్డు ఇచ్చిన పాపానికి.. చివరకు అతని ప్రాణం తీశారు.

సిమ్‌కార్డు.. ఓ నిండు ప్రాణాన్ని బలికోరింది. మిత్రుడే కదా అని సిమ్‌కార్డు ఇచ్చిన పాపానికి.. చివరకు అతని ప్రాణం తీశారు. ఓ హత్య కేసు నుంచి తప్పించుకునే క్రమంలో నిందితులు మరో హత్య చేశారు. ఇలా తప్పు మీద తప్పు చేసినా.. చట్టం నుంచి తప్పించుకోలేకపోయారు. చివరకు పోలీసుల వలలో చిక్కి కటకటాలు లెక్కిస్తున్నారు. బళ్లారి ఎస్పీ ఆర్‌.చేతన్‌ విలేకరులకు ఆదివారం తెలిపిన వివరాల మేరకు...  

- తన భార్యను వేధిస్తున్నాడంటూ కాంట్రాక్టర్‌పై పగపెంచుకున్న రిజర్వ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌
- పార్టీకి పిలిచి ఇతర కేసుల ‘నిందితుడి’తో కలసి హతమార్చిన వైనం
- ఆ కేసు నుంచి తప్పించుకునే క్రమంలో సిమ్‌కార్డు ఇచ్చిన పాపానికి స్నేహితుడినే చంపిన ‘నిందితుడు’

బళ్లారి (కర్ణాటక) : పుట్లూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తరగతి గదిలో పెరవలి శేఖర్‌(27)ను హత్య చేసి, ఆపై మృతదేహాన్ని కాల్చివేసిన కేసులో అదే గ్రామానికి చెందిన జయరాంను కర్ణాటక రాష్ట్రం బళ్లారి పోలీసులు అరెస్టు చేశారు. శేఖర్‌, జయరాం ఇద్దరిదీ పుట్లూరు కాగా, వారిద్దరూ మంచి స్నేహితులు కూడా. బళ్లారిలో ఉంటున్న ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా అలసందపల్లికి చెందిన పుల్లారెడ్డి తనయుడు కాంట్రాక్టర్‌ వెంకటరామిరెడ్డి(42)ను హత్య చేయాలని అనంతపురానికి చెందిన రిజర్వ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసరెడ్డి కుట్రపన్నాడు. అందుకు జయరాం సహకారం కోరాడు. పథకం అమలులో భాగంగా కొత్త సిమ్‌ తీసుకురావాలని జయరాంను శ్రీనివాసరెడ్డి కోరాడు. దీంతో శేఖర్‌ పుట్లూరుకు వచ్చి శేఖర్‌ను కలిశాడు. తమ మధ్య ఉన్న స్నేహంతో మిత్రుడు కోరిన వెంటనే శేఖర్‌ తన సిమ్‌ కార్డును జయరాంకు ఇచ్చాడు. దాన్ని బళ్లారికి తీసుకెళ్లి శ్రీనివాసరెడ్డికి అందజేశాడు.

భార్యను వేధిస్తున్నాడని కాంట్రాక్టర్‌పై పగ
కాంట్రాక్టర్‌ వెంకటరామిరెడ్డికి అనంతపురానికి చెందిన రిజర్వ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసరెడ్డి దగ్గరి బంధువు. శ్రీనివాసరెడ్డి బళ్లారిలో వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నివాసంలో సెక్యూరిటీ విభాగానికి బదిలీ అయ్యాడు. దీంతో కాపురాన్ని బళ్లారిలోనే పెట్టి, విధి నిర్వహణ కోసం హైదరాబాద్‌ వెళ్లొచ్చేవాడు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి భార్యను వెంకటరామిరెడ్డి తరచూ ఫోన్‌ చేసి వేధించేవాడని ఎస్పీ తెలిపారు. ఈ విషయం తెలిసి రగిలిపోతున్న శ్రీనివాసరెడ్డి ఎలాగైనా వెంకటరామిరెడ్డిని చంపాలని కుట్రపన్నాడు.

పార్టీకి పిలిచి.. కసితీరా చంపి..
పుట్లూరుకు చెందిన జయరాంతో తెప్పించిన శేఖర్‌ సిమ్‌కార్డుతో గత నెల 29న వెంకటరామిరెడ్డికి శ్రీనివాసరెడ్డి ఫోన్‌ చేసి పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచాడు. పీకల దాకా మద్యం తాపించి, గొడవ పెట్టుకున్నాడు. మాటామాట పెరగడంతో బీర్‌ బాటిల్‌తో వెంకటరామిరెడ్డిపై దాడి చేసి చంపేశాడు. అంతటితో అతని కసి తీరకపోవడంతో వెంకటరామిరెడ్డి మృతదేహాన్ని అతని బైక్‌పైనే ఉంచి తగులబెట్టి పరారయ్యారు.

హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మరో హత్య
వెంకటరామిరెడ్డి హత్య నేపథ్యంలో బళ్లారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసరెడ్డి ఉపయోగించిన సిమ్‌కార్డు ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆ సిమ్‌ పుట్లూరుకు చెందిన శేఖర్‌ పేరిట నమోదై ఉండడంతో అతని కోసం పుట్లూరుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జయరాం... ఇక అసలు విషయం పోలీసులకు తెలిసిపోతుందని భావించి శేఖర్‌ను పుట్లూరు హైస్కూల్‌ తరగతి గదిలోకి పిలిపించి హతమార్చాడు. ఆ తరువాత ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు మృతదేహంపై పెట్రోల్‌ పోసి తగులబెట్టడం ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండు హత్య కేసుల మిస్టరీని పోలీసులు ఛేదించగలిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement