‘కల్వకుర్తి’పై మీ వివరణేంటి? | Krishna Board letter to Telangana | Sakshi
Sakshi News home page

‘కల్వకుర్తి’పై మీ వివరణేంటి?

Nov 25 2015 3:09 AM | Updated on Sep 3 2017 12:57 PM

‘కల్వకుర్తి’పై మీ వివరణేంటి?

‘కల్వకుర్తి’పై మీ వివరణేంటి?

మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్ధ్యాన్ని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు

 ఏపీ ఫిర్యాదుపై స్పందించాలి
 తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ

 
 సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్ధ్యాన్ని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచుతూ తెలంగాణ చేసిన నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆంధ్రప్రదేశ్ చేసిన ఫిర్యాదుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పందించింది. ఏపీ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని మంగళవారం కృష్ణా బోర్డు తెలంగాణకు లేఖ రాసింది. ఏపీ చేసిన ఫిర్యాదుతోపాటు, సెప్టెంబర్ 8న సామర్ధ్యం పెంచుతూ తెలంగాణ ఇచ్చిన జీవో 141 ప్రతిని లేఖతో జత చేసింది. ఇదిలాఉండగా, కృష్ణా బోర్డుకు ఏపీ చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించిన విషయం తెలిసిందే.

కృష్ణా జలాల్లో రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల మేరకే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటిని వాడుకుంటున్నామని, గతంలో నిర్ణయించిన 25 టీఎంసీల నీటితో నిర్ణీత 3.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం సాధ్యం కానందునే సామర్ధ్యాన్ని 40 టీఎంసీలకు పెంచామని వివరణ ఇచ్చారు. కల్వకుర్తి ద్వారా 2 టీఎంసీల నీటిని మంచినీటికి, మరో 1.5 టీఎంసీ ప్రవాహంలో ఆవిరైపోయే దృష్ట్యా, మిగిలే 21.5 టీఎంసీలతో కేవలం 2.15 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వొచ్చని, ఈ నేపథ్యంలో నిర్ణీత ఆయకట్టుకు నీరివ్వాలంటే 40 టీఎంసీలు అవసరమని వివరించారు. ఇదే వివరాలతో తెలంగాణ బోర్డుకు లేఖ రాసే అవకాశాలున్నాయి.

 డిసెంబర్ 16న సమావేశం..
 కాగా, వచ్చేనెల 16న బోర్డు సమావేశం నిర్వహించనున్నట్టు ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసిం ది. ఇందులో ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుత్ పరమైన అంశాలు, బడ్జెట్ కేటాయింపులు తదితరాలపై చర్చిద్దామని అందు లో స్పష్టం చేసింది. ఇదే సమావేశంలో కల్వకుర్తి అంశాన్ని చర్చించే అవకాశం ఉంటుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement