ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి హంసవాహనంపై ఊరేగుతూ తన భక్తులకు దర్శనభాగ్యం కల్గిస్తారు.
కదిరి : ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి హంసవాహనంపై ఊరేగుతూ తన భక్తులకు దర్శనభాగ్యం కల్గిస్తారు. భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య శ్రీవారు తిరువీధుల గుండా విహరిస్తారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి పూజలు నిర్వహించిన మీదట యాగశాల ప్రవేశం, నిత్యహోమంతో ప్రారంభమై శ్రీవారి తిరువీధుల మండప ఉత్సవాలు నిర్వహిస్తారు. కల్యాణోత్సవం అనంతరం శ్రీవారు తిరువీధుల్లో విహరించడానికి బ్రహ్మదేవుడు తన ప్రియ వాహనం హంసను పంపుతారని భక్తుల నమ్మకం.
హంస ఏవిధంగా నీటిని, పాలను వేరుచేస్తుందో లక్ష్మీనారసింహుడు సైతం భక్తుల పాప, పుణ్యాలను వేరు చేసి మోక్షాన్ని ప్రసాదిస్తారని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, పార్థసారథి ఆచార్యులు చెబుతున్నారు. ఉత్సవానికి ఉభయ దారులుగా పట్టణానికి చెందిన తోటంశెట్టి రాజగోపాల్శెట్టి కుటుంబీకులు వ్యవహరిస్తారని ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు.