సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరి పేలుడు ఘటనపై సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. వెంకన్న ఇంట్లో గ్యాస్ లీకై తొలుత అగ్ని ప్రమాదం జరగ్గా.. మంటలు ఆర్పేందుకు వెళ్లిన సమయంలో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ పేలాయి. మంటలు ఆర్పే సమయంలో స్థానికుడు వీడియో తీస్తుండగా బ్లాస్టింగ్ జరిగింది. భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు వెళ్లిన నలుగురు మృతిచెందగా. 18 మంది గాయపడ్డారు. సెల్ ఫోన్లో బ్లాస్టింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో పేలుడు దృశ్యాలు వైరల్గా మారాయి.
కాగా, బుధవారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో కదిరి పట్టణ శివారులోని కుమ్మరవాండ్లపల్లి.. కదిరి–రాయచోటి రోడ్డుకు అతి సమీపంలోని ఓ ఇంటి నుంచి పొగలు మొదలయ్యాయి.. స్థానికులంతా గుమికూడారు. ఇంట్లో వారు మాత్రం అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. మంటలు ఆర్పుదామన్న ఆత్రుతతో స్థానికుల్లో కొందరు లోపలికి వెళ్లారు. ఇంతలోనే భారీ పేలుడు.. ఆ ఇంటితో పాటు ఇరువైపులా ఉన్న ఇళ్లు నేలమట్టమయ్యాయి. లోపలికి వెళ్లిన వారిలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

కుమ్మరవాండ్లపల్లిలో జిలెటిన్స్టిక్స్ పేలుడు జరిగిన ఇంట్లో పదేళ్లుగా తెలంగాణవాసులు ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. జనావాసాల మధ్య ఇంట్లో పేలుడు పదార్థాలు పెట్టుకుని ఉంటున్నా ఎవరికీ అనుమానం రాకపోవడం గమనార్హం. వారు కదిరి చుట్టుపక్కల రహదారుల నిర్మాణం, వెంచర్లు, రైతుల భూముల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా పెద్దపెద్ద రాళ్లను బ్లాస్టింగ్ చేసేందుకు వెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు.


