కర్ణాల కుంటకు గండి | karnala kunta breaks | Sakshi
Sakshi News home page

కర్ణాల కుంటకు గండి

Sep 21 2016 7:51 PM | Updated on Sep 4 2017 2:24 PM

కర్ణాల కుంటకు పడిన బుంగ నుంచి పోతున్న నీరు

కర్ణాల కుంటకు పడిన బుంగ నుంచి పోతున్న నీరు

అన్నదాతల ఆత్మహత్యలను నివారించడానికి, ప్రజల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పనుల నాణ్యత నవ్వలపాలవుతోంది.

  • వృథాగా పోతోన్న నీరు
  • తూతూ మంత్రంగా చెరువు పనులు
  • నాణ్యత మరచిన కాంట్రాక్టర్‌
  • దుబ్బాక: అన్నదాతల ఆత్మహత్యలను నివారించడానికి, ప్రజల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పనుల నాణ్యత నవ్వలపాలవుతోంది. మండలంలో జరిగిన మిషన్‌ కాకతీయలో నాసిరకం పనులు అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. కాంట్రాక్టర్ల లాభార్జనే ధ్యేయంగా ఐబీ అధికారుల పట్టింపులేని తనంతో మండల పరిధిలోని హబ్షీపూర్‌ గ్రామ కర్ణాల కుంట పనులు నాణ్యత లేకుండా చేశారు.

    మిషన్‌ కాకతీయ పథకం కింద కుంట మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 27.15 లక్షలను కేటాయించగా ఇటీవలనే దీని మరమ్మతులు పూర్తి చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీరు కుంటలోకి వచ్చి చేరుతోంది. ఫలితంగా కుంటకు 14 చోట్ల బుంగలు పడడంతో వర్షపు నీరంతా వృథాగా పోతోంది. కర్ణాల కుంటలోకి వచ్చి చేరుతున్న వర్షపు నీరును చూసి ఆయకట్టుదారులు ఎంతో సంబరపడ్డారు. ఆ సంబరం కొద్ది గంటల్లోనే ఆవిరైపోయింది.

    కట్ట నిర్మాణంలో నాణ్యత లోపించడంతోనే చెరువు కట్టకు బుంగలు ఏర్పడి నీరంతా వృథాగా పోతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కుంటకు పడిన గండ్ల విషయాన్ని ఆయకట్టుదారులు సదరు కాంట్రాక్టరుకు తెలపడంతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తీసుకొచ్చి గండ్లను పూడ్చే ప్రయతం చేస్తున్నారు. కుంటకు పడిన బుంగల విషయంపై ఐబీ ఏఈ రాజేందర్‌ను వివరణ కోరగా బుంగలను పూడ్చాలని సదరు కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. మిషన్‌ కాకతీయ పథకంలో చేపట్టిన చెరువు, కుంటల్లో నాణ్యత లోపిస్తే ఎంతటి వారైనా క్షమించబోమని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement