
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా హైదరాబాద్ పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా హైదరాబాద్ పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు కమిషనరేట్ల అధికారులు నిఘా, తనిఖీలు, గస్తీ, సోదాలు ముమ్మరం చేశారు. జనసమ్మర్ద ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్ వద్ద విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. పుకార్లను వ్యాపింప చేస్తున్న ఎస్సెమ్మెస్లు, సోషల్మీడియాలపై టెక్నికల్ నిఘా ఉంచే ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేశారు. ఈవ్టీజర్లుకు చెక్ చెప్పడానికి 100 షీ–టీమ్ బృందాలను వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నారు.
దీంతోపాటు స్నాచర్లుకు చెక్ చెప్పేందుకు సీసీఎస్, టాస్క్ఫోర్స్లకు చెందిన డెకాయ్ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. వీరు అనుమానాస్పద, కీలక ప్రాంతాల్లో మఫ్టీల్లో తిరుగుతూ నిఘా వేసి ఉంచుతారు. దాదాపు 40కి పైగా డెకాయ్ టీమ్స్ మోహరిస్తున్న ఉన్నతాధికారులు ఇందులో క్రైమ్ వర్క్పై పట్టున్న వాళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఎవరికైనా పుకార్లతో కూడిన సందేశాలు వస్తే వాటిని తక్షణం పోలీసుల దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు.వీటిని మరో గ్రూపులోకో, వ్యక్తిగతంగానో ఫార్వర్డ్చేస్తే సాంకేతిక నిఘాతో వారిని కనిపెట్టేలా ఏర్పాట్లు చేశారు.