విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. 33కేవీ విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన సపోర్టు తీగలు తెగి వేళాడుతున్న విషయాన్ని గమనించి కౌలు రైతు పచ్చగడ్డి కోస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన దుర్ఘటన ఇరగవరం మండలం ఆర్.ఖండ్రిక గ్రామంలో చోటుచేసుకుంది.
పచ్చగడ్డి కోస్తూ పరలోకానికి
Sep 17 2016 8:52 PM | Updated on Sep 28 2018 3:41 PM
తణుకు: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. 33కేవీ విద్యుత్ స్తంభానికి ఏర్పాటు చేసిన సపోర్టు తీగలు తెగి వేళాడుతున్న విషయాన్ని గమనించి కౌలు రైతు పచ్చగడ్డి కోస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైన దుర్ఘటన ఇరగవరం మండలం ఆర్.ఖండ్రిక గ్రామంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్.ఖండ్రిక గ్రామానికి చెందిన గుద్దాటి వెంకటేశ్వరరావు (70) స్వగ్రామంలో ఆరెకరం పొలం కౌలుకు చేస్తూ ఆవును మేపుకుంటున్నాడు. దీంతో పాటు పెరవలి వై.జంక్షన్ వద్ద జాతీయ రహదారిని ఆనుకుని టింకరింగ్ దుకాణంలో రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రోజూ విధులు పూర్తయ్యాక సాయంత్రం ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న పచ్చగడ్డిని కోసుకుని తీసుకువెళుతుంటాడు. శనివారం సాయంత్రం వెంకటేశ్వరరావు పచ్చగడ్డి కోస్తుండగా సమీపంలోని 33 కేవీ విద్యుత్ లైను వెళుతున్న ప్రాంతంలో ఉన్న స్తంభం వద్ద సపోర్టు తీగలు కిందకు వేలాడుతున్నాయి. దీనిలో ఓ తీగ 33 కేవీ విద్యుత్ లైనును తాకుతూ వెళ్లింది. దీనిని గమనించని వెంకటేశ్వరరావు పచ్చగడ్డి కోస్తూ ప్రమాదవశాత్తు సపోర్టు తీగను పట్టుకున్నాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మతిచెందాడు.
చేతిలో కొడవలి
విద్యుత్ షాక్తో వెంకటేశ్వరరావు మతిచెందిన తీరు చూపరులకు కంట తడి పెట్టించింది. ఒక చేతిలో కొడవలి మరో చేతిలో పచ్చగడ్డి పట్టుకున్న తీరు కలచి వేసింది. రోజూ అదే ప్రాంతంలో పచ్చగడ్డి కోసుకుంటూ ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. పేదకుటుంబానికి చెందిన వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పట్టణ ఎసై ్స జి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


