రబీ పంటలకు సాగునీటి సాధనకు పార్టీలకు అతీతంగా ఉద్యమిద్దామని వైఎస్ఆర్ సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ బుడ్డా శేషారెడ్డి పిలుపునిచ్చారు.
సాగునీటి కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం
Jan 26 2017 12:37 AM | Updated on May 29 2018 4:26 PM
- వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ బుడ్డా శేషారెడ్డి
వెలుగోడు: రబీ పంటలకు సాగునీటి సాధనకు పార్టీలకు అతీతంగా ఉద్యమిద్దామని వైఎస్ఆర్ సీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ బుడ్డా శేషారెడ్డి పిలుపునిచ్చారు. సాగునీటి సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణ రూపొదించేందుకు బుధవారం స్థానిక తెలుగు గంగ అతిథి గృహం వద్ద రైతులు, రైతు సంఘాల నాయకులతో బుడ్డా శేషారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 2 టీఎంసీల నీరు ఉన్నప్పుడే రబీ పంటలకు నీరు ఇచ్చారన్నారు.
ప్రస్తుతం 6 టీఎంసీల నీరు ఉన్నా ఆయకట్టుకు ఇవ్వమని చెప్పడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతల మాటలు నమ్మి రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.10 నుంచి రూ.20 వేలు ఖర్చు చేసి వరి మడులు సాగు చేశారన్నారు. మరో పది రోజుల్లో నీరందకపోతే నారుమడులకు ఎండిపోతాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోరాటమే శరణ్యమన్నారు. ప్రతి గ్రామంలో రైతు సంఘాలు ఏర్పాటు చేద్దామన్నారు. అనంతరం తెలుగుగంగ ఎస్ఈ రాఘవరెడ్డి, ఈఈ పుల్లారావులకు వేరు వేరుగా వినతిపత్రాలు అందజేశారు. సమావేశానికి వెలుగోడు, మహానంది, బండిఆత్మకూరు మండలాల రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Advertisement


