నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..!
ఒక్క నిముషం ఆలస్యమైనా అనుమతించేదిలేదని రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ స్పష్టం చేశారు.
- రేంజ్ ఐజీ ఎన్.సంజయ్
పట్నంబజారు : ఒక్క నిముషం ఆలస్యమైనా అనుమతించేదిలేదని రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ స్పష్టం చేశారు. నగరపాలెంలోని పోలీసు కల్యాణ మండపంలో జిల్లా అధికారులు, డీఎస్పీలు, సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న జరిగే ఎస్ఐ అభ్యర్థుల పరీక్షల నిర్వహణకు 21 కళశాలల్లో 37 సెంటర్లు కేటాయించినట్లు వెల్లడించారు. అనేక ప్రాంతాల నుంచి 19,559 మంది అభ్యర్థులు హాజరవతారన్నారు. ఉదయం పది గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్, వాచీలకు పరీక్ష హాల్లోకి అనుమతిలేదన్నారు. మధ్యాహ్నం అభ్యర్థులకు తక్కువ సమయం ఉన్నందున పరీక్ష ప్రాంగణాల్లోనే క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు.
అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి మాట్లాడుతూ బయోమెట్రిక్ విధానం ద్వారానే విద్యార్థులను లోపలికి అనుమతిస్తామని తెలిపారు. రూరల్ జిల్లా ఎస్పీ కె. నారాయణ్నాయక్ మాట్లాడుతూ పరీక్ష సమయంలో అభ్యర్థులు అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ పి.సిధ్ధయ్య, అడిషనల్ ఎస్పీలు జె.భాస్కరరావు, బీపీ తిరుపాల్, డీఎస్పీలు జేవీ సంతోష్, కేజీవీ సరిత, బీరం నాగేశ్వరరావు, మెహార్బాబు, కండె శ్రీనివాసులు, బి.సీతారామయ్య, బి. శ్రీనివాస్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.