ఖేడ్ మే మెగా ఫైట్... | election fight in narayankhed today | Sakshi
Sakshi News home page

ఖేడ్ మే మెగా ఫైట్...

Feb 13 2016 2:00 AM | Updated on Mar 21 2019 8:35 PM

ఖేడ్ మే మెగా ఫైట్... - Sakshi

ఖేడ్ మే మెగా ఫైట్...

ఖేడ్ ఓటరన్న వైపే అందరి చూపు.. తీర్పు ఎటువైపో తేలేది నేడే.. అభ్యర్థుల భవితవ్యంపై ఉత్కంఠ.. మరోవైపు పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

♦  ఓటరు తీర్పు నేడే పోలింగ్‌కు సర్వం సిద్ధం
♦  పకడ్బందీగా ఏర్పాట్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు చర్యలు
♦  కలెక్టర్, ఇతర అధికారుల పర్యవేక్షణ


 ఖేడ్ ఓటరన్న వైపే అందరి చూపు.. తీర్పు ఎటువైపో తేలేది నేడే.. అభ్యర్థుల భవితవ్యంపై ఉత్కంఠ.. మరోవైపు పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఉప ఎన్నికల్లో 1.88 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు  పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రోనాల్డ్‌రాస్ చెప్పారు. ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డు అందుబాటులో లేకపోతే 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్క గుర్తింపు కార్డు ఉన్నా ఓటు వేయవచ్చని అన్నారు. 16న ఎన్నికల ఫలితాల ప్రకటన ఉంటుందని తెలిపారు. - నారాయణఖేడ్

 నారాయణఖేడ్ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం శుక్రవారం ఖేడ్‌లో పోలింగ్ సిబ్బం దికి అవసరమైన ఈవీఎంలతోపాటు పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసి ఆయా కేంద్రాలకు పంపించారు. రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సాగిన ఈవీఎంలు, సామగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఎన్నికల పరిశీలకులు పర్యవేక్షించారు.   - నారాయణఖేడ్
 
♦  వెబ్‌కాస్టింగ్ ద్వారా కేంద్రాల పర్యవేక్షణ
♦  వీడియో చిత్రీకరణ  భారీగా బలగాలు
రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు వెల్లడి

 నారాయణఖేడ్/రేగోడ్: నారాయణఖేడ్ నియోజకవర్గంలో శనివారం జరగనున్న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఖేడ్‌లోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద శుక్రవారం పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామగ్రిని అంజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పోలింగ్ సిబ్బందికి గతంలోనే రెండుమార్లు శిక్షణ ఇచ్చామన్నారు. శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌కు ముందు 6గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించినట్టు తెలిపారు. 125 మంది మైక్రో అబ్జర్వర్లు, 200 మంది వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని.. ప్రతి విషయం రికార్డు అవుతుందన్నారు. కేంద్రం నుంచి ఎన్నికల వ్యయ పరిశీలకులు కూడా వచ్చారని తెలిపారు. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే సత్వరం మరో ఈవీఎంను ఏర్పాటు చేస్తామన్నారు. అందుకుగాను పలు ఈవీఎంలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
 
ఆర్టీసీ బాదుడు.
 నారాయణఖేడ్: ఖేడ్ ఉప ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ అ ధికారులు ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చే స్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్‌కు వచ్చేందుకు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీ రూ.73. కాగా శుక్రవారం స్పెషల్ బస్సు పేరిట సర్వీసులను నడిపిన అధికారులు రూ.110 వసూలు చేశారు. ఒక్కో టికెట్‌పై ఇలా రూ.37 అదనంగా వసూలు చేయడమేమిటని ప్రశ్నిస్తే అధికారులు చెప్పినట్టే వసూలు చేస్తున్నామని కండక్టర్లుసమాధానమిచ్చారని ప్రయాణికులు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement