వైద్యో నారాయణో హరి | Sakshi
Sakshi News home page

వైద్యో నారాయణో హరి

Published Mon, Aug 22 2016 11:25 PM

వైద్యో నారాయణో హరి

4 లక్షల మంది 
భక్తులకు వెద్య సేవలు
పక్కా ప్రణాళిక అమలు 
జిల్లాలో 165 వైద్య శిబిరాలు
300 మంది స్పెషాలిటీ వైద్యులు
ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ 
 
విజయవాడ (లబ్బీపేట) : 
వేలాదిమంది భక్తుల రాకపోకలు, వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువ. ఎప్పడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి.  అయినా పక్కా ప్రణాళికతో వైద్య ఆరోగ్యశాఖ సేవలందించింది. ఇందుకు మూడంచెల విధానాన్ని అమలు చేసి అనారోగ్యానికి గురైన యాత్రికులకు తక్షణ వైద్య సహాయం అందించి క్రిటికల్‌ కేసులను సకాలంలో ప్రత్యేక పుష్కర వార్డులకు తరలించి ప్రాణనష్టం జరగకుండా చూసింది. పుష్కరాల్లో ఇప్పటివరకు 4 లక్షల మందికి వైద్యసేవలు అందించారు. 
మూడంచెల వ్యవస్థ అమలు 
జిల్లాలో 165 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా వాటిలో 300ల మంది స్పెషాలిటీæ వైద్యులు (ఆరో్ధపెడిక్, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, అనస్థీషియా)లతో పాటు మరో 300 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు విధులు నిర్వహించారు. వైద్య శిబిరంతో పాటు ఫస్ట్‌ లెవల్‌ రిఫరల్‌ సెంటర్, ప్రత్యేక వార్డులు ఇలా మూడంచెల వ్యవస్థను అమలు చేశారు. తొలుత వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి అనంతరం సమీపంలోని ఫస్ట్‌లెవల్‌ రిఫరల్‌ సెంటర్‌కు తరలించి వైద్యం అందించారు.  మెరుగైన వైద్యం అవసరమైతే ప్రభుత్వాస్పత్రిలోని ప్రత్యేక వార్డులకు తరలించారు. వందకు పైగా అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచడంతో పాటు రోగులను సకాలంలో ఆస్పత్రులకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. 
ఉన్నత స్థాయి పర్యవేక్షణ 
జిల్లాకు నోడల్‌ ఆఫీసర్‌గా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఆర్‌. నాగమల్లేశ్వరి వ్యవహరించగా పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి ఉన్నత స్థాయి అధికారులందరూ నగరంలోనే మోహరించి సేవలను పర్యవేక్షించారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌లతో పాటు  డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ అరుణకుమారి, స్పెషలాఫీసర్‌గా నియమితులైన పారా మెడికల్‌ బోర్డు కార్యదర్శి డాక్టర్‌ టి. వేణుగోపాలరావు, ఇతర అడిషినల్‌ డైరెక్టర్స్‌ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.  
సమన్వయంతో సేవలు
జిల్లాలోని వైద్యులు, సిబ్బందితో పాటు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది సిబ్బందికి విధులు కేటాయించి వారందరినీ సమన్వయ పరుస్తూ సేవలందించడంలో డీఎంహెచ్‌వో విజయం సాధించారు. ఒకవైపు సిబ్బందికి సకాలంలో భోజనాలు అందకున్నా అరటిపండ్లు, బిస్కెట్లు పంపిణీ చేస్తూ వారు సేవలు అందించేలా కృషి చేశారు. 
 

Advertisement
Advertisement