చంద్రబాబు, హరిదాసుకు తేడా లేదు | cpm rambhupal fires on cm chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, హరిదాసుకు తేడా లేదు

Aug 17 2017 10:31 PM | Updated on Aug 13 2018 8:12 PM

చంద్రబాబు, హరిదాసులకు పెద్ద తేడాలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ అన్నారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: చంద్రబాబు, హరిదాసులకు పెద్ద తేడాలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ అన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ‘‘కరువు నివారణ చర్యలు చేపట్టాలి... ప్రతి రైతు కుటుంబానికి రూ. 5 వేల పింఛన్‌ను అందించాలి’’ అన్న డిమాండ్‌తో సదస్సును నిర్వహించారు.  సదస్సులో పాల్గొన్న రాంభూపాల్‌, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఓబులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, గతేడాది ఎన్టీఆర్‌ ఆశయం పేరుతో జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రూ.6,550 కోట్లను ప్రకటించిన చంద్రబాబు... వాటిలో కనీసం రూ.5 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన పాపాన పోలేదన్నారు.

ఇచ్చిన హామీ నెరవేరక ఏడాదవుతున్నా... ఇక్కడి ప్రజాప్రతినిధులు కనీసం మాట్లాడే పరిస్థితిలో లేరన్నారు.   జిల్లాలో 38 లక్షల ఎకరాల భూమి ఉంటే 3.5 శాతం మాత్రమే నీటి అందిస్తున్నారనీ, అందువల్లే  పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పట్టిసీమ ద్వారా వచ్చే నీటిని రాజధాని ప్రాంతంలో బహుళ ప్రయోజనాలకు, పరిశ్రమల కోసం వినియోగించుకుంటున్నారనీ, ఇక్కడ మాత్రం తాగడానికి కూడా నీరు అందడం లేదన్నారు. రైతులతో రూ. 21,500 కోట్ల ఇన్సూరెన్స్‌ను కట్టించుకుని, కేవలం రూ.7,400 కోట్లు మాత్రమే ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నారన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి దుస్థితి నెలకొందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి సాయం లేక...ఎంచేయాలో తెలియని పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా 42 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కరువుపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కరువు నివారణ చర్యలను చేపట్టలేదన్నారు.

సమస్యల పరిష్కారం కోసం సదస్సులు
రైతు కష్టాలపై ఈ నెల 16 నుంచి 31 వరకు, అలాగే సెప్టెంబర్‌ 1 నుంచి 15 వరకు నిరుద్యోగ సమస్యపై సదస్సులు సదస్సులు నిర్వహిస్తున్నట్లు రాంభూపాల్‌ తెలిపారు. వీటితో పాటు మహిళ చట్టంపై సదస్సులను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నల్లప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement