ఎమ్మెల్యే అనితపై ఫిర్యాదు | complaint against MLA Anitha | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అనితపై ఫిర్యాదు

Aug 17 2016 11:35 PM | Updated on Aug 21 2018 9:20 PM

పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్వాతంత్య్ర దిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని అగౌరవ పరిచేలా వ్యవహరించారంటూ ఎంపీపీ అయ్యపురెడ్డి వరహాలమ్మ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ గణపతిరావుకు బుధవారం ఫిర్యాదు చేశారు.

కోటవురట్ల: పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్వాతంత్య్ర దిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని అగౌరవ పరిచేలా వ్యవహరించారంటూ ఎంపీపీ అయ్యపురెడ్డి వరహాలమ్మ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ గణపతిరావుకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అనితకు జాతీయ పతాకాన్ని ఎలా ఆవిష్కరించాలో తెలియకపోవడం శోచనీయమన్నారు.  మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రొటోకాల్‌ ప్రకారం జాతీయ జెండాను ఎంపీపీ ఎగురవేయాల్సి ఉండగా, రాజకీయ దురుద్దేశంతో ఎమ్మెల్యే  ఆవిష్కరించారని చెప్పారు.

వందేమాతరం గీతాన్ని ఆలపించకుండానే హడావుడిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,  జనగనమణ ఆలపించకుండానే వెళ్లిపోయారన్నారు. ఎంతో పవిత్రంగా చేయవలసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాజకీయం చేసి అపవిత్రం చేశారని ఆవేదన చెందారు. జాతీయ పతాకాన్ని అగౌరవపరిచిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని, ఇదే అంశంపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఫిర్యాదు అందజేసిన వారిలో జెడ్పీటీసీ సభ్యురాలు వంతర వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు అవుగడ్డి రాజకుమారి, సర్పంచ్‌లు శెట్టి వరహాలమ్మ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement