అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి | cheeraala student dies in america | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Aug 16 2015 3:10 PM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి - Sakshi

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

ఉన్నత చదువులు చదవాలనే తన కోరికను నిజం చేసుకునేందుకు దేశంకాని దేశం వెళ్లాడు.

ఒంగోలు: ఉన్నత చదువులు చదవాలనే తన కోరికను నిజం చేసుకునేందుకు దేశంకాని దేశం వెళ్లాడు. అయితే విధి అతని ఆశలు ఆదిలోనే తుంచివేసింది. ఉన్నత చదువులు చదివి తిరిగి వస్తాడనుకున్న కొడుకు దేశం వదిలి వెళ్లి నెలరోజులు గడువక ముందే విగతజీవి అయ్యాడని తెలిసిన ఆ తల్లిదండ్రుల గుండెలు పుట్టెడు శోకంతో నిండిపోయాయి. వివరాలు... ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని పేరాలకు చెందిన తాటికొండ రమేష్ పేరాల మసీదు సెంటర్‌లో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. రమేష్కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు తాటికొండ బాలసురేంద్రకుమార్ (25) 2007లో తంజావూరులోని శస్త్ర ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదివాడు. చదువుతున్న రోజుల్లో క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించి చెన్నైలో మూడు సంవత్సరాలు పనిచేశాడు.

అయితే ఎంఎస్ చదివేందుకు ఉద్యోగాన్ని వదిలి గత నెల 22వ తేదీన అమెరికాలోని టెక్సాస్ వెళ్లాడు. బాలసురేంద్రకుమార్ 14వ తేదీన చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. వారంతపు ఆటవిడుపు కోసం స్నేహితులతో కలిసి విహారయత్రకు వెళ్లాడు. అక్కడ ఉన్న జలపాతం వద్ద ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందాడు. స్నేహితులు ఆదివారం తెల్లవారుజామున సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీరాల ఇన్‌ఛార్జి యడం బాలాజీ ఎన్నారై కావడంతో టెక్సాస్‌లోని తానా సభ్యులతో మాట్లాడారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా చీరాలకు తీసుకువచ్చేందుకు వారితో మాట్లాడారు. కొడుకు మరణవార్త విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement