తాడేపల్లిగూడెం సిగలో మరో ప్రతిష్టాత్మక కేంద్ర విద్యాసంస్థ చేరుతోంది...
గూడెంకు సెంట్రల్ ఐటీఐ
Jun 15 2017 12:32 AM | Updated on Sep 5 2017 1:37 PM
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం సిగలో మరో ప్రతిష్టాత్మక కేంద్ర విద్యాసంస్థ చేరుతోంది. మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సెంట్రల్ ఐటీఐ స్కూల్ ఇక్కడ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి తొలిదశ పనులకు రూ.12 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల నిర్వహణకు సన్నాహాలు సాగుతున్నాయి. తాత్కాలిక వసతిలో సెంట్రల్ ఐటీఐ తరగతులు నిర్వహించేందుకు అధికారులు భవనాల వేటలో పడ్డారు. శాశ్వత భవన నిర్మాణానికి ఐదెకరాల భూమిని కేటాయిస్తున్నారు. కేటాయించే భూమి, దానిలో భవన నిర్మాణాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు బుధవారం సేకరించారు.
నాలుగు కోర్సులు
ఈ ఐటీఐలో కేంద్ర ప్రభుత్వ కోర్సులు మాత్రమే ఉంటాయి. ఎలక్ట్రికల్, ఫిట్టర్, సివిల్, డీజిల్ మెకానికల్ వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. 400 మంది విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పిస్తారు. ఈ స్కూల్కు 47 మంది సిబ్బందిని నియమిస్తారు. మొత్తం సెంట్రల్ సిలబస్ ఉంటుంది. ఐటీఐ నిర్వహణ బాధ్యతల్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఇప్పటికే ఈ ఐటీఐ కోసం ఐదెకరాల స్థలం కేటాయించారు.
రెండు రోజుల్లో తాత్కాలిక వసతి
సెంట్రల్ ఐటీఐలో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు నిర్వహించడానికి అనుమతి వచ్చింది. ఇందుకోసం రెండు రోజుల్లో వసతి సౌకర్యాలను సిద్ధం చేస్తాం. తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం.
– పైడికొండల మాణిక్యాలరావు, దేవాదాయ శాఖ మంత్రి
Advertisement
Advertisement