గుంతకల్లు టౌన్ : మరో పదిహేను రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి. కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. మరోవైపు బంధువులకు శుభలేఖలు పంచిపెడుతూ ఆహ్వానిస్తున్నారు. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాదఛాయలు.
గుంతకల్లు టౌన్ : మరో పదిహేను రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి. కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. మరోవైపు బంధువులకు శుభలేఖలు పంచిపెడుతూ ఆహ్వానిస్తున్నారు. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాదఛాయలు. తిరుపతికి వెళ్లొస్తానని బయలుదేరిన కాబోయే వరుడు తెల్లారేసరికి ఇంటి సమీపంలోని రైలు పట్టాలపై మృతదేహమై కనిపించడంతో అందరూ దిగ్బ్రాంతికి గురయ్యారు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. గుంతకల్లు హనుమేష్నగర్కు చెందిన అరుణ, నాగయ్య దంపతుల రెండో కుమారుడైన నాగార్జున(27) అలియాస్ ఇజ్రాయెల్ కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు.
నాగార్జునకి ఈ మధ్యనే హావళిగి గ్రామానికి చెందిన ఓ యువతితో నిశ్చితార్థమైంది. జూన్ 3, 4 తేదీల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురంలో వారి పెళ్లి జరగాల్సి ఉంది. మంగళవారం రాత్రి పని నిమిత్తం తిరుపతి వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన నాగార్జున బుధవారం ఉదయానికల్లా ఇంటికి సమీపంలోని(గుంతకల్లు–కల్లూరు) రైల్వే ట్రాక్పై మృతదేహమై పడి ఉన్నాడు. రైలుకింద పడి మరణించడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. నాగార్జున ప్రమాదవశాత్తు మరణించాడా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నాడా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.


