కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభం | Brahmotsavalu in Kanipakam | Sakshi
Sakshi News home page

కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Sep 6 2016 7:39 PM | Updated on Sep 4 2017 12:26 PM

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ఏకదంతుడి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

- తొలిరోజు రాత్రి హంసవాహనంపై విహరించిన గణనాథుడు
- ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయశాఖ మంత్రి


ఐరాల (చిత్తూరు జిల్లా) : కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ఏకదంతుడి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం గ్రామోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేశారు. అన్వేటి మండపంలో ఉన్న స్వర్ణ ధ్వజస్తంభం వద్ద మూషిక పటాన్ని ఉంచి గణపతి పూజ, స్వస్తివాచనం, నవగ్రహ సంధి, పుణ్యాహవచనంలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడం కోసం ఉదయం స్వాతి నక్షత్రం, కన్యాలగ్నంలో 7 గంటల నుంచి 8 గంటల మధ్య ధ్వజస్తంభంపై మూషికపటాన్ని ఎగురవేశారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన మంగళవారం రాత్రి హంస వాహనంపై ఊరేగారు. కాణిపాకం, అగరంపల్లె, కారకాంపల్లె, వడ్రాంపల్లె, తిరువణంపల్లెకు చెందిన శీరికరుణీక వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement