త్వరలోనే బీసీ సబ్‌ప్లాన్ | Bc soon sabplan | Sakshi
Sakshi News home page

త్వరలోనే బీసీ సబ్‌ప్లాన్

Aug 11 2013 1:54 AM | Updated on Sep 1 2017 9:46 PM

త్వరలోనే బీసీ సబ్‌ప్లాన్ అమలుకానుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.

కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : త్వరలోనే బీసీ సబ్‌ప్లాన్ అమలుకానుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శని వారం బీసీ జనదిశ సదస్సు ప్రొఫెసర్ మురళీమనోహర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా కేంద్ర మంత్రి బలరాంనాయక్, రాష్ట్ర మంత్రి సారయ్య, ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సారయ్య మాట్లాడారు. రాష్ట్రంలో మొదటిసారిగా మహా త్మా జ్యోతిరావుపూలే పేరుతో బీసీ మేనిఫెస్టో కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు కోసం కేంద్రానికి నోట్ తయారు చేసి పంపించామని వివరించారు. ముఖ్యమంత్రి సైతం బీసీ సబ్‌ప్లాన్‌పై చొరవ చూపారని, త్వరలోనే దేశవ్యాప్తంగా బీసీ సబ్‌ప్లాన్ అమలయ్యే అవకాశం ఉందని తెలిపారు. అధికశాతం శ్రమజీవులు, నాగరికత తెలిసినవారు, అందరితో కలిసిమెలిసి ఉండేవారు బీసీలేనని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం పార్టీలకతీతంగా అందరం ఒకటి కావాలని సూచించారు. అనంతరం ప్రొఫెసర్ మురళీమనోహర్ మాట్లాడారు. రాష్ట్రంలో 80 శాతం, దేశంలో 56 శాతం జనాభాలో బీసీలే ఉన్నారని వెల్లడించారు. బీసీలను ఏకం చేయడం కోసం త్వరలోనే జాతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనంతరం ముఖ్య అతిథులను చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సన్మానించారు. ప్రొఫెసర్లు రవీందర్, దామోదర్, మనోహర్‌రావు, టి.రమేష్, బీసీ నాయకులు గుండు ప్రభాకర్, బయ్య స్వామి, మీసాల ప్రకాష్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు దిడ్డి కుమారస్వామి, సాదుల దామోదర్, కటకం పెంటయ్య, చాంబర్ మాజీ అధ్యక్షుడు కంభంపాటి కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు మందా వినోద్‌కుమార్, గోరంటల రాజు, వేముల నాగరాజు, బస్వరాజు శ్రీమాన్, బస్వరాజు కుమార్, వస్కుల ఉదయ్‌కుమార్, కొమ్ము సుధాకర్, బాసాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

 నిరాశతో వెనుదిరిగిన  ఉద్యోగ జేఏసీ నాయకులు..
 కేంద్ర సామాజిక సహాయ మంత్రి బలరాం నాయక్‌ను సన్మానించడం కోసం జిల్లా ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు రాజేష్‌గౌడ్, నగర అధ్యక్షుడు గజ్జెల రామకృష్ణ తదితరులు చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయానికి విచ్చేశారు. కాగా ఈ లోపే మంత్రి బలరాంనాయక్ వేరే పనిమీద బయటకు వెళ్లడంతో ఉద్యోగులంతా నిరాశకు గురయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement