ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఏపీలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో తిరగరాదంటూ సరిహద్దు దాటించి వదిలేసిన వైనం
ఇబ్రహీంపట్నం, విజయవాడ (గాంధీనగర్), జగ్గయ్యపేట: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఏపీలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సరిహద్దులోని గరికపాడు చెక్పోస్టు దాటిన అనంతరం ఆయన్ను వదిలిపెట్టారు. విజయవాడలో ప్రెస్మీట్ నిర్వహించి, కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కంభంపాటి స్వామి (రోడ్డు ప్రమాదంలో మరణించారు) కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మందకృష్ణ ఇబ్రహీంపట్నం చేరుకుని స్థానిక పలగాని హోటల్లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ప్రాంతంలో తిరగడానికి వీల్లేదంటూ మందకృష్ణను, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కోట దానియేలును బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లి గరికపాడు చెక్పోస్టు దాటాక వదిలిపెట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు దొండపాటి సుధాకర్ మాదిగను స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు.