బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్ట్ | Accused arrested in warangal Girl sexual assault case | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్ట్

Jun 26 2016 9:32 AM | Updated on Oct 4 2018 8:29 PM

బాలికపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

వరంగల్: బాలికపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సంపేట రూరల్ సీఐ బోనాల కిషన్, ఎస్సై కేసు వివరాలను వెల్లడించారు.

మండలంలోని రాంతీర్థం శివారు బిల్‌నాయక్‌తండా గ్రామానికి చెందిన బాలిక (17) కొన్నేళ్ల నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు ఇంటి వెనక ఉన్న మాలోతు సమ్మయ్య, మాలోత్ దేవ్‌జీ ఇళ్లకు వెళ్తుండేది. ఈ సందర్భంగా సదరు వ్యక్తులు బాలికను లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడుతున్నారు. కాగా, బాలిక తాతయ్య ఇటీవల చెరువులో పడి మృతి చెందగా.. ఆయన ఆస్థికలను కాళేశ్వరంలోని గోదావరి నదిలో కలిపేందుకు కుటుంబ సభ్యులు ఈ నెల 20వ తేదీన వెళ్లారు.

ఈ క్రమంలో సమ్మయ్య, దేవ్‌జీలు బాలికపై మరోమారు లైంగికదాడికి పాల్పడేందుకు పథకం రచించారు. బాలిక నీళ్ల కోసం వెళ్లగా రూ.100 ఇచ్చి గుడుంబా, కూల్‌డ్రింక్స్ తెప్పించుకుని రెండింటిని కలిపి ఆమెకు తాగించారు. అనంతరం ఇద్దరు కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. అయితే బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని బంధువులకు చెప్పి బోరున విలపించింది. ఈ మేరకు ఆమె శుక్రవారం ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు నిర్భయ, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులు మాలోత్ సమ్మయ్య, మాలోత్ రావ్‌జీను అరెస్టు చేశారు. అలాగే బాలికను చికిత్స నిమిత్తం వరంగల్ సీకేఎం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement