జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం రూపంలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
అనంతపురం సెంట్రల్ : జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం రూపంలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరెందరో వికలాంగులుగా తయారవుతున్నారు. జాతీయ రహదారుల వేగాన్ని నియంత్రించలేకపోతుండడంతోనే ఎక్కువశాతం ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రోడ్డు భద్రతా వారోత్సవాల పేరుతో అధికారులు హడావుడి చేస్తున్నా ఆచరణలో ఫలితాలు సాధించలేకపోతున్నారు. 2016 సంవత్సరంలో అధికారికంగా 1394 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 637 మంది మృతి చెందగా, 2084 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సగానికిపైగా వికలాంగులుగా మారారు. 2017 సంవత్సరం ప్రారంభం నుంచి రోడ్డు ప్రమాదాలు మరీ ఎక్కువయ్యాయి. ఇప్పటికే వందకు పైగా ప్రమాదాలు జరిగాయి.
ప్రముఖులను పొట్టన పెట్టుకున్న ప్రమాదాలు..
ఈ ఘటనల్లో ప్రముఖులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముఖ్యంగా జేఎన్టీయూ వీసీ ఎంఎంఎం సర్కార్ ఒకరు. బుధవారం పామిడి మండల కేంద్రం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీసీతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు బాబాఫకృద్దీన్, డ్రైవర్ నాగప్రసాద్ దుర్మరణం చెందారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు టైరు పగిలి డివైడర్ను దాటుకొని లారీని ఢీకొట్టింది. వీసీ ప్రయాణిస్తున్న కారు వంద కిలోమీటర్లకు పైగా స్పీడుతో వెళుతున్నట్లు అంచనా వేశారు. ఇదే తరహాలోనే ఈ నెల ఐదో తేదీన విధినిర్వహణలో చురుగ్గా ఉండే కానిస్టేబుల్ ప్రేమ్కుమార్ (40) కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి సమీపాన స్కార్పియో వాహనం ప్రమాదంలో మృతి చెందారు.
ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల ఆరో తేదీన బత్తలపల్లి మండలం నల్లబోయనపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న సంఘటనలో గుంతకల్లుకు చెందిన నాగరాజు, మస్తాన్ఖాన్లు మృత్యువాత పడ్డారు. గతేడాది డిసెంబర్లో కర్నూలు జిల్లా డోన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ కౌన్సిలర్లు వై.మాధవి, వై.రామ్మోహన్రెడ్డి దంపతులతోపాటు వారి కుమార్తె దుర్మరణం చెందారు. ఈ ప్రమాదాలన్నీ అతివేగంతోనే జరిగాయని స్పష్టమవుతోంది. జాతీయ రహదారిపై వేగ నియంత్రిక సాధనాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కనీసం సూచికబోర్డులు కూడా ఎక్కడా కనిపించవు. ఫలితంగా అనేకమంది ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు.