ప్రాణం తీసిన ప్రేమ

Young Women Commit to Suicide With Love Failure - Sakshi

ప్రేమికుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్యాయత్నం

చికిత్స పొందుతూ మృతి

పెద్దపల్లి,హుజూరాబాద్‌రూరల్‌: ‘శ్రీకాంత్‌ పెళ్లి చేసుకుంటావని నమ్మించి మోసం చేశావు. తొమ్మిదేళ్లు ప్రేమించుకుంటున్నా.. నన్ను కోలుకోలేని దెబ్బ కొట్టావు..దేవుడు ఉంటే ఇంతకింత అనుభవిస్తారు..’ అంటూ సూసైడ్‌నోట్‌ రాసి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమికుడు పెళ్లికి నిరాకరించాడని మనోవేదనకు గురైన సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి పరిధిలోని లస్మన్నపల్లికి చెందిన కనకం ప్రవళిక(24) హెయిర్‌డై తాగి ప్రాణాలు తీసుకుంది. గ్రామానికి చెందిన కనకం ఎల్లయ్య–మాణిక్యమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె ప్రవళిక హన్మకొండలోని ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది.

ఇంటి పక్కనే ఉంటున్న సమీప బంధువు మొలుగూరి శ్రీకాంత్, ప్రవళిక కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీకాంత్‌ తల్లిదండ్రులు వేరే సంబంధం చూడడంతో ఈనెల 28న ప్రవళిక సూసైడ్‌నోట్‌ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుజూరాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జమ్మికుంటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదుతో ఎస్సై శ్రీధర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top