ఫ్రెండ్స్తో పార్టీ.. రూ. 5 వేల కోసం..
లక్నో : ఖర్చుచేసిన రూ. 5 వేలకు ఇంట్లో లెక్క చెప్పలేక భయపడ్డ ఓ యువకుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు. పోలీసులను తప్పుదోవ పట్టించి చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన రిజ్వాన్ అనే 29 ఏళ్ల యువకుడు మంగళవారం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఇంట్లోనుంచి తెచ్చిన రూ. 5వేలు పార్టీకి ఖర్చు చేశాడు. అంతా ఖర్చైన తర్వాత ఇంట్లో ఏం సమాధానం చెప్పాలో అతడికి అర్థం కాలేదు. తీవ్రంగా ఆలోచించి కిడ్నాప్ డ్రామాకు తెరతీశాడు. తనను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, స్కూటరుతో పాటు వద్ద ఉన్న రూ. 5 వేలు దోచుకున్నారని.. దాద్రి దగ్గరలోని అడవుల్లోకి తీసుకెళ్లి చంపాలని చూస్తున్నారని ఇంట్లో వారికి ఫోన్ నుంచి సందేశం పంపించాడు. అది చదివిన అతడి తండ్రి భయంతో పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి, కొడుకు పంపిన సందేశాన్ని వారికి చూపించాడు.
అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడి ఫోన్ నెంబర్ను ట్రాక్ చేశారు. అయితే ఆ ఫోన్ నోయిడాలోని సూరజ్ పూర్ వద్ద ఉన్నట్లు తేలింది. అతడు పంపిన సందేశానికి.. ఫోన్ ఉన్న స్థలానికి పొంతన లేకపోవటంతో పోలీసుల్లో అనుమానం మొదలైంది. ఈ మేరకు ఫోన్ను ట్రాక్ చేస్తూ వెళ్లిన పోలీసులకు రిజ్వాన్ దర్శనమిచ్చాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఖర్చు చేసిన రూ. 5 వేల లెక్క చెప్పలేకే భయంతో కిడ్నాప్ డ్రామా ఆడానని విచారణలో తెలిపాడు.