టీడీపీ కౌన్సిలర్‌ దాడిచేసిన కొద్ది గంటల్లోనే | young man dead in Suspicious status | Sakshi
Sakshi News home page

యువకుడి అనుమానాస్పద మృతి

Jan 30 2018 11:39 AM | Updated on Nov 6 2018 7:53 PM

young man dead in Suspicious status - Sakshi

రైలుపట్టాలపై హరీష్‌ మృతదేహం

కాశీబుగ్గ: స్వీటు దుకాణంలో రేగిన తగాదా ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి తీసుకెళ్లింది. నలుగురి మధ్య అవమానానికి గురైన అతడు మనస్తాపం చెందాడు. రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఓ తెలుగు దేశం పార్టీ నాయకుడు చేసిన దౌర్జన్య కాం డకు ఈ యువకుడికి అర్ధంతరంగానే నూరే ళ్లు నిండాయి. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. పలాసలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన డోకి హరీష్‌(25) అనే యువకుడు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని కేటీరోడ్డులో లక్ష్మి స్వీట్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. పలాస–కాశీ  బుగ్గ మున్సిపాలిటీలోని 14వ వార్డు కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు పైల చక్రధర్‌ ఈ స్వీటు దు కాణానికి ఆదివారం వచ్చాడు.

చేయిపెట్టి ఓ స్వీటు తీసుకొని తిన్నాడు. రెండోసారి చేయిపెట్టి తినడంతో, సార్‌ ఎంగిలి అవుతుందని షాపులో పనిచేస్తున్న డోకి హరీష్‌ చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన అతడు హరీష్‌ను బయటకు ఈడ్చుకొచ్చి చితకబాదాడు. దీనిపై బాధితుడు, షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్‌ ఇరువురిని రాజీ చేసి విడిచిపెట్టారు. ఇది పాఠకులకు తెలిసిందే. అయితే బాధిత యువకుడు తగిలిన దెబ్బలను తట్టుకోలేక ఆ రాత్రి ఇం టికి చేరలేదు. ఎక్కడికో వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు ఊరుకున్నారు.

శవమై కనిపించిన హరీష్‌
టీడీపీ నాయకుడి చేతిలో దెబ్బలుతిన్న యువకుడు సోమవారం శవమై కనిపించాడు. వజ్రపుకొత్తూరు మం డలం బెండిగేటు సమీపంలో హారీష్‌ మృతదేహాన్ని జీఆ ర్‌పీ పోలీసులు గుర్తించారు. ఫొటోలను మృతుడి కు టుంబ సభ్యులకు చూపడంతో తమ కుమారుడేనని వా రు గుర్తించారు. అయితే ఇతడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఎవరైనా హత్య చేసి రైలు పట్టాలపై పడేశారా అనేది తెలియలేదు.

ఒక పూట పని.. మరో పూట కోచింగ్‌
డోకి హరీష్‌ గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవా డు. స్వీటు దుకాణంలో పని చేసుకుంటూనే చదువుకుంటున్నాడు. ఇటీవల బీకాంలో డిగ్రీ పట్టా పొందాడు. బీద కుటుంబం కావడంతో తండ్రి రైలు బండిపై అప్పడాలు అమ్ముతుంటాడు. తల్లి మరణించగా పినతల్లి వద్ద హరీష్‌ జీవితం కొనసాగిస్తున్నాడు. చెల్లి డోకి పూజ చ దువుతోంది. కుటుంబంపై భారం పడకూడదని స్వీట్‌ దు కాణంలో పనిచేస్తున్నాడు. ఒక్కపూట పనిచేస్తు మ రోపూట కోచింగ్‌కు వెళ్లేవాడు. షాపు యజమాని కోపగించుకుంటారని భావించి కొనుగోలుదారునితో గొడవపడి తన ప్రాణాలపైకి తీసుకువచ్చాడు. మద్యం మత్తులో ఉన్న కౌన్సిలర్, మరికొందరు దౌర్జన్యంగా యువకుడిని చితకబాదడంతో తాళలేకపోయాడు.

మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే హరీష్‌ మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పో లీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన హరీష్‌కు న్యా యం జరగకుండా బలవంతంగా రాజీ చేయించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు న్యాయం చేస్తారని వెళ్లిన మా అన్నయ్యకు న్యాయం జరగలేదని, పోలీసులు మా అన్నయ్యను కాపాడలేకపోయారని, నాయకులతో జతకూడారని, అన్యాయంగా మా అన్నయ్యను చంపేశారని మృతుడి చెల్లి పూజ ఆరోపిస్తోంది. అయితే స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకుల ఒత్తిడి మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత
డోకి హరీష్‌ మృతితో కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌ వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. హరీష్‌పై దాడి చేసిన కౌన్సిలర్‌ పైలచక్రధర్‌పై ఆది వారం ఫిర్యాదు చేసినప్పుడే అతనిపై కేసు నమోదు చేసి ఉంటే.. హరీష్‌ చనిపోయి ఉండేవాడు కాదని అతని తండ్రి వెంకటరావు, చెల్లి పూజలు ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్‌ చనిపోయిన విషయం తెలుసుకున్న బ్రాహ్మణతర్లా గ్రామస్తులు స్టేషన్‌ వద్దకు సోమవారం రాత్రి భారీగా చేరుకున్నారు. సర్కిల్‌ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని నినా దాలు చేశారు. వీరికి మద్దతుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు, పార్టీ శ్రేణులు కూడా స్టేష న్‌కు వచ్చి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.అశోక్‌కుమార్‌తో మాట్లాడారు. కౌన్సిలర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హరీష్‌ తండ్రి వెంకటరావు కూడా కౌన్సిలర్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో దిగివచ్చిన పోలీసులు కౌన్సిలర్‌ చక్రధర్‌పై కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement