హత్యా.. ఆత్మహత్యా? | Young Man Commits Suicide Nalgonda | Sakshi
Sakshi News home page

హత్యా.. ఆత్మహత్యా?

Jan 4 2019 10:47 AM | Updated on Jan 4 2019 10:47 AM

Young Man Commits Suicide Nalgonda - Sakshi

చంద్రశేఖర్‌(ఫైల్‌), నీటి సంపు ఇదే..

చండూరు : మండలంలోని బంగారిగడ్డ గ్రామ కృష్ణా నీటి  సంపులో పడి మృతి చెందిన చిలుకూరి చంద్రశేఖర్‌ (చందు)ది హత్యా..ఆత్మహత్యానా అనేది మిస్టరీగానే మిగిలింది. చండూరు మండల కేంద్రానికి చెందిన చిలుకూరి చంద్రశేఖర్‌ (26)(చందు)మిషన్‌ భగీరథలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ ( కాంట్రాక్టు)గా పనిచేస్తున్నాడు. ఇతను డిసెంబర్‌ 31 తేదీన మునుగోడు మండల కేంద్రంలో మీటింగ్‌కని వెళ్లి అక్కడి నుంచే హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాడు.

తిరిగి 2 తేదీన ( బుధవారం) మునుగోడు మండల కేంద్రానికి చేరుకున్న సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుంది. అప్పటి నుంచే కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. గురువారం ఉదయం బంగారిగడ్డ కృష్ణా నీటి సంపులో శవమై కనిపించాడు. మృతుడి స్కూటీని గుర్తించిన గ్రామస్తులు బంధువులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం పంపించారు.

ఒత్తిడికి లోనై..
మృతుడు చంద్రశేఖర్‌కు సంబంధించిన వాహనంలో సుసైడ్‌ నోట్‌ లభించింది. ఇందులో వదినలు, అన్నలు క్షమించాలని, అమ్మను బాగు చూసుకోవాలని రాసి ఉంది. అమ్మకు తన ముఖం చూయించకుండా వెళ్తున్నందుకు తనను క్షమించాలని ఉంది. ఇదంతా ఓ భాగమైతే... తను డిప్రెషన్‌కులోనై చనిపోతున్నా అని రాసి ఉంది. మృతుడికి ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆనందంగా ఉండే వాడని బంధువులు  చెప్తున్నారు.

అసలు డిప్రెషన్‌లోకి  ఎందుకు వెళ్లాడు.. అసలు ఆ మూడు రోజులు హైదరాబాద్‌ లో ఎక్కడ ఉన్నాడు... ఫోన్‌ లో ఎవరితో మాట్లాడాడు...ఏం మాట్లాడాడు అనే కోణంలో ఇప్పటికే పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అసలు కారణాలు రాయకుండా డిప్రెషన్‌కు లోనై అనే ఒకే కారణం చూపించడంపై అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయంపై ఎస్‌ఐ సైదులు వివరణ ఇస్తూ మృతదేహం పోస్టుమార్టమ్‌ రిపోర్టు తర్వాత అసలు విషయం బయటకు వస్తుందన్నారు. అనేక విధాలుగా వివరాలు సేకరించే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. 

చంద్రశేఖర్‌(ఫైల్‌), నీటి సంపు ఇదే.. 

Advertisement
 
Advertisement
Advertisement