కట్నం వేధింపులకు వివాహిత బలి | Women Committed Suicide | Sakshi
Sakshi News home page

కట్నం వేధింపులకు వివాహిత బలి

Jun 1 2018 2:26 PM | Updated on Jun 1 2018 2:26 PM

Women  Committed Suicide - Sakshi

స్వప్న మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు(ఇన్‌సెట్‌) స్వప్న(ఫైల్‌)  

గన్నేరువరం(మానకొండూర్‌) : చదువుకునే రోజు ల్లో ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఇంట్లో తెలిసి వద్దన్నా... పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులు సజావుగా సాగిన వీరి కాపురానికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. కొడుకు కావాలనే భర్త ఆశ దంపతుల మధ్య తగువునకు ప్రారంభమైంది. ఈ క్రమంలో అత్తామామల అదనపు కట్నం వేధింపులు తోడయ్యాయి. దీంతో ఆ అబల ఉరేసుకుని ఉసురు తీసుకుంది. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో గురువారం చోటు చేసుకుంది.  

ప్రేమ వివాహం.. 

కరీంనగర్‌ పట్టణంలోని భగత్‌నగర్‌లో నివాసం ఉంటున్న తోట వెంకటప్రకాశ్‌ ఆర్టీసీ ఉద్యోగి. ఇతడికి భార్య శారద, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్నకూతురు స్వప్న(32) పీజీ వరకు చదివింది. ఈ క్రమంలో గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన కట్కూరి శ్రీపాల్‌రెడ్డితో ప్రేమలో పడింది. పెద్దలను ఒప్పించి వీరిరువురు 2010 ఆగస్టు14న వివాహం చేసుకున్నారు.  

కరీంనగర్‌లో నివాసం.. 

వెంకటప్రకాశ్‌కు ఇద్దరు కూతుళ్లు కావడంతో తనకున్న ఆస్థితో పాటు కరీంనగర్‌లో ఉన్న ఇంటిని రెండు భాగాలుగా చేసి పంచిఇచ్చాడు. దీంతో శ్రీపాల్‌రెడ్డి– స్వప్న దంపతులు కరీంనగర్‌లోనే కాపురం పెట్టారు. శ్రీపాల్‌రెడ్డి ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. స్వప్న ఓ ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా చెబుతోంది. ఈ క్రమంలో వీరికి ఇద్దరు ఆడపిల్లలు విస్మయ, విన్నత్న జన్మించారు.  

కొడుకు కావాలని.. 

ఇద్దరు పిల్లల తరువాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకుందామని స్వప్నకోరగా.. తనకు వంశోధారకుడు కావాలని శ్రీపాల్‌రెడ్డి పట్టుపట్టాడు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో వెంకటప్రకాశ్‌ ఉద్యోగం నుంచి రిటైర్డ్‌ అయ్యాడు. ఆ సమయంలో వచ్చిన డబ్బులను ఇద్దరు కూతుళ్లకు సమానంగా పంచిఇచ్చాడు. దీంతో కొద్దికాలం స్వప్న కాపురం సవ్యంగా సాగింది.  

తోడైన అత్తామామల వేధింపులు.. 

శ్రీపాల్‌రెడ్డిని తల్లిదండ్రులు ఇంటికి రావాలని కోరడం తో ఏడాదిక్రితం కా పురాన్ని గుండ్లపల్లికి మార్చారు. అక్కడ స్వప్నకు భర్తతో పా టు అత్తామామల వేధింపులు తోడయ్యాయి. మరింత కట్నం తీసుకురావాలని నిత్యం వేధించారు. నాలుగురోజుల క్రితం స్వప్నను, పిల్లలను ఇంట్లో వదిలేసి అత్తామామ, భర్త వేరే ఊరికి వెళ్లారు. బుధవారం రాత్రి శ్రీపాల్‌రెడ్డి ఇంటికి రాగా.. ఇద్దరిమధ్య మళ్లీ గొడవైంది.

దీంతో తీవ్రమనస్తాపం చెందిన స్వప్న ‘తనచావుకు అత్తామమనే కారణమని, పిల్లలను తన తల్లిదండ్రులు చూసుకోవాలని, ఆస్తిని పిల్లల పేరిట రాయాలని’ నోటురాసి గురువారం ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన పిల్లలు పక్కింటివారికి చెప్పారు. వారు వచ్చి చూడగా అప్పటికే ప్రాణం పోయింది. వారు స్వప్న కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

మృతదేహంతో ఆందోళన 

స్వప్నచావుకు భర్త శ్రీపాల్‌రెడ్డి, అత్త అరుణ, మామ అంజిరెడ్డిలే కారణమని కుటుంబసభ్యులు శ్రీపాల్‌రెడ్డి ఇంట్లో మృతదేహంతో ఆందోళన చేశారు. ఆస్థి మొత్తాన్ని పిల్లల పేరున రిజిస్ట్రేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మృతురాలి అత్తమామలపై దాడికి యత్నించారు. వారిని ఎస్సై వంశీకృష్ణ అడ్డుకున్నారు.

తిమ్మాపూర్‌ సర్కిల్‌ సీఐ కరుణాకర్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. స్వప్నతండ్రి ఫిర్యాదుతో భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement