దివిలిలో మహిళ దారుణ హత్య
ఆస్తి తగాదాల నేపథ్యంలో ఘటన
తూర్పుగోదావరి, పెద్దాపురం: కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలకు కారణమవుతోందన్న అక్కసుతో తమ్ముడి అత్తను అత్యంత దారుణంగా ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన గురువారం జిల్లాలోని పెద్దాపురం మండలం దివిలిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సిరిగినీడి అమలావతి(49) పట్టపగలు అత్యంత దారుణంగా తన అల్లుడి అన్న చేతిలో దారుణ హ్యతకు గురైంది. పట్టపగలు అత్యంత దారుణంగా ఆమెను హతమార్చి ‘మీ అమ్మను చంపేశాం వెళ్లిపో’’ అని నిండు గర్భిణి అయిన మరదలు శివగంగకు చెప్పి అన్న, తమ్ముడు, తండ్రి పరారయ్యారు. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన సిరిగినీడి విష్ణుమూర్తి, అమలావతి దంపతుల చిన్న కుమార్తె శివగంగకు మూడేళ్ల క్రితం పులిమేరు గ్రామానికి చెందిన మాగాపు గణేష్తో వివాహమైంది.
వారికి రెండేళ్ల పాప జన్మించింది. గతం నుంచి అత్త అమలావతికి అల్లుడు గణేష్ కుటుంబాలకు ఆస్తి తగాదా నడుస్తోంది. ఇటీవల పెద్దల వద్ద ఒప్పందం కుదుర్చి రాజీ పడ్డారు. ఆ వివాదాల నేపథ్యంలో కుటుంబ కలహాలకు అమలావతి నిత్యం కారణమవుతోందన్న అక్కసుతో గణేష్ అన్న అయ్యన్న గురువారం ఉదయం దివిలి లో ఆమె ఇంటికి వచ్చి ‘మా ఇంటి పరువు రచ్చకీడుస్తున్నావే’ అంటూ కత్తితో అత్యంత దారుణంగా నరికి హతమార్చాడు. అక్కడి నుంచి పులిమేరులో ఉన్న ఆమె మరదలు శివగంగకు ‘మీ అమ్మను చంపేశాను. మీ అమ్మని చివరి చూపు చూసుకో’ అంటూ చెప్పి అక్కడి నుంచి అయ్యన్న తమ్ముడు గణేష్, తండ్రి వెంకట్రావులతో కలిసి పరారయ్యాడు. నిండు గర్భిణి అయిన శివగంగ దివిలి వచ్చి అమ్మ మృతదేహాన్ని చూసి రోదించిన తీరు చూపరులను కంట తడిపెట్టించింది.
విషయం తెలుసుకు పెద్దాపురం సీఐ జి.
యువకుమార్, ఎస్సై కృష్ణ భగవాన్ హుటాహుటిన అక్కడికి చేరుకుని హత్య ఘటన కారణాలపై ఆరా తీశారు. నిందితులు పరారీలో ఉన్నారని, ఆస్తి తగాదాలు, కటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగిందని, నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఈ మేరకు సీఐ యువకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.