భర్త ముందే.. భార్యపై ఘోరం

Woman gang-raped in front of husband - Sakshi

నెలమంగల తాలూకాలో దుండగుల అఘాయిత్యం

సాక్షి, బెంగళూరు/ దొడ్డబళ్లాపుర: కామాంధులు చెలరేగిపోతున్నారు. ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. వివరాలు... తుమకూరుకు చెందిన 26 ఏళ్ల వివాహిత ఉపాధి కోసం నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లికి వచ్చి ఓ గార్మెంట్‌ పనిచేస్తోంది. వారం రోజుల క్రితం స్థానిక దూబరహళ్లి గ్రామంలో ఇంటిని అద్దెకు తీసుకుంది. ఆమె ఉద్యోగానికి వెళ్లే సమయంలో అదే గ్రామానికి చెందిన వెంకటేష్‌ అనే ఆటోడ్రైవర్‌ వెంటపడే వాడు. ఎన్ని సార్లు చెప్పినా పద్ధతి మార్చుకోలేదు. నవంబర్‌ 19న కూడా వెంకటేష్‌ ఆమె వెంట పడ్డాడు.  సహనం కోల్పోయిన మహిళ చెప్పుతో వెంకటేష్‌ను కొట్టింది. గ్రామస్తుల మధ్య తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని అతడు స్నేహితులైన రౌడీషీటర్‌ రాఘవేంద్ర, పునీత్, విజయ్‌ కుమార్‌తో కలిసి అదే రోజు రాత్రి మహిళ ఇంటికి వచ్చాడు.

ఆమె భర్తను మారణాయుధాలతో బెదిరించి అతని ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. బంధువులు, స్నేహితుల సూచనల మేరకు 21వ తేదీన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన వెంకటేష్, రాఘవేంద్ర, పునీత్‌లను శనివారం అరెస్టు చేశారు. విజయ్‌కుమార్‌ పరారీలో ఉన్నాడు. కాగా ఈ కేసుకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. బాధితురాలికి ప్రధాన నిందితుడైన వెంకటేష్‌కు మధ్య మొదటి నుంచి సన్నిహిత సంబంధముందని తెలుస్తోంది

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top